ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 మే 2020 (15:54 IST)

మొదటి భార్యకు విడాకులు.. రెండో భార్య ఆత్మహత్య.. మూడో భార్యను చంపేశాడు..

నేరాలు పెరిగిపోతున్నాయి. ఓపిక లేకపోవడం.. క్షణికావేశాలు.. ఆధునిక పోకడలతో నేరాలు చేసే వారి సంఖ్య పెచ్చరిల్లిపోతోంది. తాజాగా ఓ భర్త ఉన్మాదిలా వ్యవహరించాడు. కట్టుకున్న భార్యను దారుణంగా కడతేర్చాడు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఈ దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను అతి దారుణంగా హత్య చేసి, ఆ తర్వాత మిద్దె పైనుంచి దూకి తీవ్ర గాయాల పాలయ్యాడు. 
 
వివరాల్లోకి వెళితే.. గిద్దలూరు మండలం కొమ్మునూరు పంచాయతీ ఎగ్గెన్నపల్లె గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తెల్లవారుజామున  నిద్రిస్తున్న తన భార్య తలపై సిమెంట్‌ దిమ్మెతో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఒంగోలు రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
 
ఎగ్గెన్నపల్లె గ్రామానికి చెందిన వర్రా వెంకటరమణకు సుమారు 30 ఏళ్ల కిందట మార్కాపురం అంబారుపల్లెకు చెందిన అనంతమ్మను ఇచ్చి వివాహం చేశారు. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు. ఇద్దరు కూతుళ్లకు వివాహం చేశారు. మరో కూతురు, కొడుకు మార్కాపురంలోని బంధువుల ఇంటి దగ్గర ఉండి చదువుకుంటున్నారు. వారం రోజుల వరకు మార్కాపురంలో ఉన్న వెంకటరమణ ఇటీవలే ఎగ్గెన్నపల్లెలో ఉన్న భార్య దగ్గరికి వచ్చాడు. శనివారం రాత్రి భార్యాభర్తలు ఇంటి వరండాలో నిద్రించారు.
 
ఇంతలో ఏం జరిగిందో కానీ వెంకటరమణ ఉన్మాదిలా మారాడు. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో నిద్రిస్తున్న భార్య అనంతమ్మ తలపై సిమెంటు దిమ్మెతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వెంకటరమణ భార్యను చంపడానికి కారణం ఏంటో తెలియ రాలేదు. 
 
అనంతమ్మ వెంకటరమణకు మూడో భార్య. గతంలో మొదటి భార్యకు విడాకులిచ్చాడు. రెండో వివాహం చేసుకుంటే, ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత దూరపు బంధువైన అనంతమ్మను పెళ్లి చేసుకున్నాడు వెంకటరమణ. ఆమెను కూడా అతను పొట్టనబెట్టుకున్నాడు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.