శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : శుక్రవారం, 22 ఏప్రియల్ 2016 (11:08 IST)

నత్తనడకన హంద్రీ - నీవా ప్రాజెక్టు పనులు.. ఎప్పటికి పూర్తయ్యేనో?

చిత్తూరు జిల్లాలో హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లా ప్రజలకు సాగు, తాగునీరు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన హంద్రీ - నీవా ప్రాజెక్టు పనులు చాలా ఆలస్యంగా జరుగుతోంది. కాంట్రాక్టర్ల అలసత్వంతో పాటు ప్రభుత్వ అధికారుల చేతకాని తనం వల్ల హంద్రీ - నీవా ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తయ్యేటట్లు కనిపించడం లేదు.
 
2005 సంవత్సరం ఏపీలోని కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకర్గం మాల్యాల గ్రామం నుంచి హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులను ప్రభుత్వం ప్రారంభించింది. రెండు విడతలుగా ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. మొదటి విడతగా కర్నూలు, అనంతపురం జిల్లాల మీదుగా ప్రాజెక్టు పనులను ప్రారంభించినా ఆలస్యంగా 2014 సంవత్సరంలో పూర్తయ్యాయి. ఆ తర్వాత రెండవ విడతగా చిత్తూరు జిల్లాలో ప్రారంభించారు. అయితే చిత్తూరు జిల్లాలో జరుగుతున్న పనులు చాలా ఆలస్యంగా కొనసాగుతున్నాయి. 
 
మదనపల్లి సమీపంలోని అంగళ్ళ వద్ద ప్రస్తుతంగా ఈ రెండవ దశ ప్రాజెక్టు పనులు కొనసాగుతుండగా ఆ పనులన్నీ చాలా ఆలస్యంగా జరుగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. వేసవికాలం లోపలే చిత్తూరు జిల్లాలో ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. అయితే ఆయన ఆదేశాలనే అధికారులు బేఖాతరు చేశారు. ఇప్పటికీ ఆలస్యంగానే పనులు జరుగుతుండటం ఇందుకు ఉదాహరణ. గత పదిరోజుల క్రితం స్వయంగా ముఖ్యమంత్రి ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విధుల్లో అలసత్వం వహిస్తే తోలు తీస్తానంటూ వార్నింగ్‌ కూడా ఇచ్చారు. అలాగే కాంట్రాక్టర్ల విషయంలోను సీరియస్‌ అయ్యారు బాబు. సరిగ్గా పనిచేయని కాంట్రాక్టర్లని అవసరమైతే బ్లాక్‌ లిస్టులో పెట్టాలని ఆదేశాలిచ్చారు.
 
స్వయంగా సీఎం హెచ్చరించినా అటు అధికారుల్లోనూ, ఇటు కాంట్రాక్టర్లలోను ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. పనులు మాత్రం ఆలస్యంగానే కొనసాగుతున్నాయి. జూలై నెలలోపు మదనపల్లిలో జరుగుతున్న ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ఇప్పటికే చంద్రబాబు కృతనిశ్చయంతో ఉండగా మరో నాలుగునెలలైనా పనులు మాత్రం అధికారులు పూర్తి చేసేటట్లుగా మాత్రం అధికారులు కనిపించడం లేదు. ఈ పనులే ఇలా ఉంటే ప్రాజెక్టును పూర్తి చేసేలోపు పుష్కరకాలం కాస్త గడిచిపోతుందని జిల్లా వాసులు చెప్పుకుంటున్నారు. ప్రాజెక్టు పనులపై సీఎం ఏ విధంగా స్పందింస్తారో వేచి చూడాల్సిందే.