శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: గురువారం, 15 అక్టోబరు 2020 (20:06 IST)

ఏపీలో పాఠశాలలకు సెలవులు తగ్గింపు, సంక్రాంతికి మూడు రోజులు మాత్రమే

కరోనావైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గతంలో పోలిస్తే కేసుల ఉధృతి తగ్గినా వైరస్ భయం మాత్రం ప్రజల్లో ఇంకా తగ్గలేదు. ఇప్పటికే కరోనా లాక్‌డౌన్ వల్ల విద్యార్థులు ఎక్కువగా నష్టపోయారు. ఇవాళ నుంచి పాఠశాలలు తెరుచుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చినా, ఏపీలో జగన్ సర్కారు మాత్రం నవంబరు 2వ తేదీ నుంచి పాఠశాలలు తెరవాలని నిర్ణయించుకుంది.
 
అందుకు తగ్గట్టే విద్యాశాఖ అధికారులు కూడా ఈ విద్యా సంవత్సరానికి అకడమిక్ క్యాలండర్‌ను సిద్దం చేసే పనిలో పడ్డారు. దాదాపు ఐదు నెలలు పని దినాలు తగ్గడంతో జగన్ సర్కారు అందుకు అనుగుణంగా సిలబస్‌లో కూడా మార్పు చేస్తోంది. దీనికి తగు విధానంలో విద్యాశాఖ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. అదేవిధంగా ఉపాధ్యాయులు సెలవులపై కూడా పరిమితిని విధించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
 
వారానికి ఆరు రోజులు పనిదినాలు ఉండే విధంగా ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు ప్రణాళికను సిద్దం చేశారు. సాధారణంగా సంక్రాంతికి పది నుంచి 13 రోజులు సెలవు ఉండేది. కాని ఈ సారి కేవలం మూడు రోజులు మాత్రమే సెలవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా పాఠశాల హాజరు పట్టికలో ఇకపై కులం, మతం వివరాలు ఉండకూడదని విద్యాశాఖ సంచాలకులు వీరభద్రుడు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థి, విద్యార్థిని పేరు ఒకే రంగు సిరాతో రాయాలని ఆదేశాలు జారీచేశారు.