శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 అక్టోబరు 2020 (18:25 IST)

పెరిగిన ప్రధాని మోడీ ఆస్తులు.. నిధులివ్వాలంటూ సీఎం కేసీఆర్ లేఖ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆస్తులు పెరిగాయి. గత 15 నెలల కాలంలో ఆయన ఆస్తుల విలువ ఏకంగా 36.53 లక్షల మేరకు పెరిగాయి. దీంతో మోడీ చరాస్తుల విలువ రూ.1,75,63,618గా ఉంది. తనకు వచ్చే జీతాన్ని ప్రతి నెలా బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో పొదుపు చేస్తున్నారు. ఈ కారణంగా ఆయన చరాస్తులు పెరిగాయి. 
 
అయితే, స్థిరాస్తుల్లో మాత్రం ఎలాంటి తేడా లేదు. గాంధీనగర్‌లో ఉన్న ఇల్లు, స్థలం విలువ రూ.1.1 కోట్లు. ఆయనకు జీవిత బీమా ఉంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లలో కూడా పొదుపు చేశారు. జూన్ 30 నాటికి ఆయన పొదుపు ఖాతాలో రూ.3.38 లక్షలు ఉన్నాయి. ఆయన వద్ద నగదు రూపంలో రూ.31,450 ఉన్నాయి.
 
ఇదిలావుంటే, హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ వర్షాల కారణంగా ఏర్పడిన వరద దెబ్బకు భాగ్యనగరం అతలాకుతలమైంది. దీని నుంచి ఇప్పట్లో తేరుకునే ప్రసక్తే లేదు. ఈ వర్షాలు, వరదల వల్ల భారీ నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు.
 
రాష్ట్రంలోని పలు ప్రాంతాలు వర్షాల వల్ల నష్టపోయాయని... ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని లేఖలో కోరారు. ప్రాథమిక అంచనాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.5 వేల కోట్లకు పైగా నష్టం జరిగినట్టు చెప్పారు. తక్షణ సాయం, పునరావాస చర్యల కోసం వెంటనే రూ.1,350 కోట్లను అందించాలని కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.