శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 21 మే 2020 (06:15 IST)

రాష్ట్ర ప్రగతిపై సిఎంతో మేధో మదనం: మంత్రి ఆదిమూలపు సురేష్

రాష్ట్ర ప్రగతిపై ఈ నెల 25 నుంచి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో మేధో మదన సమీక్ష కార్యక్రమం జరగనుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సచివాలయం నాల్గవ బ్లాక్ మొదటి అంతస్తులోని  మంత్రి తన ఛాంబర్ లో రాష్ట్ర స్థాయి విద్యాశాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి చేస్తున్న మౌలిక సదుపాయాలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న అంశంపై  రాష్ట్రస్థాయి విద్యాశాఖ అధికారులకు  మంత్రి పలు సూచనలు చేశారు. ఏడాది ప్రభుత్వ పాలనలో సంక్షేమ పథకాల అమలు తీరుపై  ఆయన చర్చించారు. 
 
సంవత్సర కాలం పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మన్నన పొందిన నేపథ్యంలో సంవత్సర కాలంలో ఏయే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఏవిధంగా తోడ్పాటు అందించాయన్న అంశంపై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులతో చర్చించామన్నారు.

ఈ కార్యక్రమాలను రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న అంశంపై మేధోమదనంలో ఐదురోజుల పాటు ముఖ్యమంత్రి దిశానిర్ధేశం చేయనున్నారని తెలిపారు. సిఎంతో జరిగే  మేధో మదన సమీక్షను విజయవంతం చేసేందుకు విద్యాశాఖకు సంబంధించి చేపట్టాల్సిన కార్యక్రమాల రూపకల్పనపై ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యాశాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

ప్రధానంగా గడచిన ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, వాటి ఫలాలు ఏమేరకు ప్రజలకు చేరువయ్యాయి అనే అంశంపై ప్రభుత్వం సమీక్ష చేపడుతున్నట్లు మంత్రి అధికారులకు వివరించారు. కార్యక్రమం ప్రాంరభం నుంచి ముగింపు వరకు తీసుకోవాల్సిన అంశాలపై మంత్రి అధికారులతో చర్చించారు.

మేధో మదనం కార్యక్రమం మొత్తం 5 రోజులు జరగనుందని తెలిపారు. తొలి రోజున వ్యవసాయం, రెండవ రోజున విద్యాశాఖ, మూడో రోజున  వైద్యఆరోగ్యశాఖ, నాల్గవ రోజున గ్రామ –వార్డు వాలంటరీ వ్యవస్థ, చివరి రోజున ప్రణాళిక విభాగంకు చెందిన శాఖలతో ఏడాది పాలనపై సమీక్ష జరగనుందని తెలిపారు. 

ఈ కార్యక్రమం నిర్వహణపై సీనియర్ అధికారితో ఛైర్మన్ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ప్రతిరోజు మేధో మదన సమీక్షలు  ఛైర్మన్, కమిటీ సభ్యుల పర్యవేక్షణలోనే జరుగుతాయని తెలిపారు. మంత్రి ఆదిమూలపు సురేష్ తో జరిగిన సమీక్షలో ప్రధానంగా ఎవరెవరూ కార్యక్రమంలో పాల్గొనాలి, అతిథులకు సమీక్షలో అవకాశం కల్పిస్తే బాగుంటుందని మంత్రి ముందు అధికారులు ప్రస్తావించారు.

దీనిపై స్పందించిన మంత్రి త్వరితగతిన కార్యక్రమ షెడ్యూల్ ను రూపొందించాలని సూచించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా కార్యక్రమాలను రూపకల్పన చేయాలని ఆదేశాలు జారీచేశారు.

వైయస్ఆర్ నవరత్నాలలోని విద్యా నవరత్నాలుగా అమలు చేస్తున్న 1. అమ్మఒడి 2. మౌలిక సదుపాయాల రూపకల్పన 3. విద్యాప్రమాణాలు పెంపు 4. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లవిద్య 5. మాతృభాషా వికాసం 6. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, పాదరక్షలు  7. నైపుణ్యాభివృద్ధి 8.ప్రైవేటు విద్యాసంస్థలపై రెగ్యులేటరీ కమిషన్ 9.  పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు, అధ్యాపకుల నియామకం వంటి అంశాలను మంత్రి సమావేశంలో ప్రస్తావించారు.

ఎక్కడా రాజీ లేకండా విద్యాశాఖ పనిచేసేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి వివరించారు. ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తెలియజేయనున్నామని తెలిపారు.

సమావేశంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి చిన్న వీరభద్రుడు, కళాశాల సాంకేతిక విద్య,రూసా ఎస్పిడి అధికారి నాయక్, ఆంగ్లవిద్య ప్రత్యేక అధికారి వెట్రి సెల్వి, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఛైర్మన్ రామ చంద్రారెడ్డి తదతరులు పాల్గొన్నారు.