శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 30 ఆగస్టు 2019 (08:28 IST)

అజయ్ కల్లంపై జగన్ అసంతృప్తి?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కార్యాలయంలో అన్నీ తానై పాలనా వ్యవహరాలు చక్కబెడుతున్న అజయ్‌ కల్లం రెడ్డిని సాగనంపడానికి డెసిషన్ జరిగిపోయిందా? వెలగపూడి సెక్రటేరియేట్‌లో వినిపిస్తున్న టాక్ ఇదే. 1983 బ్యాచ్ ఆఫీసర్ అజయ్ కల్లం గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్ద ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు.

చాలా నిక్కచ్చిగా, నిజాయితీగా, కాస్త మొండిగా, ఓవరాల్‌గా గట్టి కమిట్‌మెంట్‌గా పనిచేస్తారని పేరు. అప్పట్లో రాజశేఖర్‌రెడ్డి మొదటిసారి 2004లో ముఖ్యమంత్రి అయ్యినప్పుడు ఎలాంటి పరిపాలన అనుభవం లేకపోవడం, ‘ఫ్యాక్షన్ లీడర్’ అనే ముద్ర కూడా ఉండడంతో ఒక పరిపాలనా దక్షత కలిగిన బ్యూరోక్రాట్ ఎలా అయితే అవసరం అని అనుకున్నారో.. ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి కాగానే అలానే తనకు ఒక స్థితప్రజ్ఞుడైన అధికారి సేవలు అవసరం అని భావించారు. ఏరికోరి అజయ్ కల్లం రెడ్డిని తెచ్చుకున్నారు.
 
అజయ్ కల్లాంకు పరిపాలనలో విస్తృతమైన అనుభవం ఉండడమే కాకుండా క్లీన్ ఇమేజ్ కూడా ఉంది. అందుకే జగన్ ఆయన్ని ఎంచుకున్నారు. గుంటూరు జిల్లా బాపట్ల ప్రాంతానికి చెందిన అజయ్ కల్లం గతంలో రెవెన్యూ, ఫైనాన్స్ వంటి కీలకమైన శాఖల్లో పనిచేసిన అనుభవం ఉంది.

ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. చంద్రబాబు హయాంలో ఛీఫ్ సెక్రటరీ హోదాకు ప్రమోట్ అయ్యి… అదే హోదాలో రిటైర్మెంట్ తీసుకున్నారు. అమరావతి నిర్మాణం, సింగపూర్ ఒప్పందం వంటి అంశాలను విమర్శనాత్మక దృష్టితో చూసిన అజయ్‌ కల్లం రెడ్డి.. ఎన్నికలకు కొద్దికాలం ముందు రాజధాని అంశంపై చెలరేగిన వివాదాలన్నింటిపై మేథావులతో కలిసి అనేక చర్చావేదికలపై తన అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకున్నారు.

మేలుకొలుపు పేరుతో ఆయన రాసిన పుస్తకం వ్యవస్థను పెనునిద్దర వదిలించే అనేక అంశాలను స్పృశించిందని విద్యాధికులు మెచ్చుకున్నారు. అధికారంలోకి రాకముందే జగన్‌కు అజయ్ కల్లం దగ్గరయ్యారు. పాలనలో నైపుణ్యాలను నేర్చుకునేందుకు సలహాదారుగా తనకు ఒక సమర్ధుడైన అధికారి అవసరం పడినప్పుడు అజయ్ కల్లం రెడ్డికే బాధ్యతలు అప్పగించారు జగన్.

నెలకు రెండున్నర లక్షల వేతనంతో తన ముఖ్య సలహాదారుగా నియమించుకుని కేబినెట్ హోదా కల్పించారు. అప్పటి నుంచి ప్రభుత్వానికి అత్యంత కీలకమైన సీఎంవోలో కార్యదర్శుల బృందానికి అజయ్ కల్లం నేతృత్వం వహిస్తున్నారు.  ప్రభుత్వంలోని అన్ని విభాగాలకు సలహాలు ఇస్తూ అన్నీ తానై నడిపిస్తున్నారు. సీఎంవోలోని ఇతర కార్యదర్శులు, సలహాదారులు అందరూ కూడా అజయ్ కల్లాంకే బాధ్యులు.
 
ఒక్కమాటలో చెప్పాలంటే.. జగన్మోహన్‌రెడ్డి రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకుంటుంటే… అజయ్ కల్లం పరిపాలనలో సర్వం తానై నడిపిస్తున్నారు. ఏదైనా అంశం సీయం దృష్టి దాటి పోవచ్చును కానీ.. అజయ్ కల్లం కళ్లు గప్పి ఎవరూ ఏ శాఖలోనూ ఏదీ చేయలేరు.

అంత నిశిత దృష్టితో అజయ్‌కల్లం అన్నీ చూసుకుంటున్నారు. అలాంటి సలహాదారుని ఇంత తొందరగా జగన్‌మోహన్‌రెడ్డి వదులుకోడానికి చూస్తున్నారన్న వార్తలే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.
 
ఇటీవల దఫదఫాలుగా మంత్రి బొత్స సత్తిబాబు అమరావతి గురించి చేసిన కామెంట్లు, ఆ తరవాత పార్టీలో ఎవరికీ వారు ఏదో ఒక స్టేట్మెంట్ పడేస్తూ  ఇష్టమొచ్చినట్టు మాట్టాడుతుండటం.. పోలవరం రీటెండరింగ్ అంశంలో కోర్టు ఉత్వర్వులు.. వద్దంటున్నా మొండిగా వ్యవహరిస్తోందన్న కారణంతో కేంద్రం కన్నెర్ర.. తర్వాత పీఎంవో పిలిపించి వివరణ అడగడం.. వంటి అనేక పరిణామాలతో ప్రభుత్వం బాగా అప్రదిష్ట పాలయ్యింది. జనంలో పలుచనయ్యింది.

ముఖ్యంగా పోలవరం రీటెండరింగ్ అంశంలో అన్ని  అంశాలూ పరిశీలించి.. ముఖ్యంగా కేంద్రాన్ని ముందే ఒప్పించి నిర్ణయాలు తీసుకోకుండా దుందుడుకుగా వ్యవహరించడంతో అటు కోర్టు చివాట్లు పెట్టింది. ఇటు కేంద్రం దగ్గర తలబొప్పి కట్టింది. ఇంకా.. ఇసుక పాలసీ, విద్యుత్ ఒప్పందాలు.. ఇతరత్రా అనేక అంశాలలో పాలనాపరంగా సరైన మార్గదర్శకత్వం లేకపోవడం వల్లే పరువు పోగొట్టుకునే పరిస్థితి వచ్చిందని జగన్ ఒక అభిప్రాయానికి వచ్చారు.

అజయ్ కల్లం నుంచి సరైన దిశానిర్దేశం లేకపోవడం వల్లనే ఈ సమస్యలు ఎదురైనట్టుగా భావించిన జగన్.. ఈమధ్య చాలా ఆయన విషయంలో అసహనంగా వున్నారని, ఆయన సేవలు తనకు అవసరం లేదనే నిర్ణయానికి వచ్చి ఇక సాగనంపాలని అనుకుంటున్నారని సమాచారం. అమరావతి రాజధానిగా ఉండాలా లేదా అనే ముఖ్యమైన అంశంలో సరైన వ్యూహాన్ని అనుసరించకపోవడం అజయ్ కల్లం తప్పిదమేనని జగన్ నమ్ముతున్నారు. 
 
జగన్ సీయం అయినప్పుటి నుంచి ‘వెలగపూడి’పై పెద్దగా పట్టు సంపాదించలేక పోతున్నారని అధికారవర్గాల నుంచి వినిపిస్తున్న వ్యాఖ్యలు. మొక్కుబడిగా కలెక్టర్ల సమావేశం నిర్వహించి అదే రోజు నుంచి ఆయన తన ప్రతీకార రాజకీయాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టడంతో పాలనాపరమైన పట్టు సంపాదించలేకపోయినట్టు చెబుతున్నారు.

దాంతో, అడ్మినిస్ట్రేషన్ అంతా అజయ్ కల్లం మీదే వదిలేశారు. ఐతే, ఇప్పటి వరకు అజయ్ కల్లం కూడా అంతే బాధ్యతగా.. ఎక్కడా అవినీతి మరక అంటకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. నవరత్నాల వంటి ప్రభుత్వ ప్రాధాన్య అంశాలపై విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన ఫుల్ ఫోకస్ పెట్టారు.

 
కానీ, మొన్న సీఎం జగన్ US పర్యటన సమయంలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అమరావతి విషయంలో ప్రభుత్వం ఎందుకు ముందుకు వెళ్లలేకపోతోందో ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పడంలో మంత్రులు విఫలం అయ్యారు. పోలవరం రీటెండరింగ్ అంశంలో కూడా చెప్పాల్సిన కారణాలు చెప్పి ప్రజలను, న్యాయస్థానాన్ని, కేంద్రాన్ని ఒప్పించడంలో రాజకీయ వైఫల్యమంతా ఇప్పుడు పాలనాపరమైన వైఫల్యంగా కనిపించి అజయ్ కల్లంను బాధ్యుల్ని చేస్తున్నారు.