టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రికి తరలింపు (Video)
కడప వేదికగా టీడీపీ జాతీయ మహానాడు జరుగుతోంది. ఈ మాహానాడులో పాల్గొన్న ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వేదికపై కూర్చొనివుండగా, ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో మహానాడులో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.
ఈ వివరాలను పరిశీలిస్తే మహానాడు కార్యక్రమంలో భాగంగా జలీల్ ఖాన్ వేదికపై కూర్చొనివుండగా, ఆయన హఠాత్తుగా కుప్పకూలిపోయారు. ఇది గమనించిన ఇతర నేతలు, కార్యకర్తలు వెంటనే అప్రమత్తమై ఆయనన హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
కాగా, విజయవాడ వెస్ట్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అయిన జలీల్ ఖాన్... రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1999లో కాగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఆయన వైకాపాలో చేరి విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2016లో టీడీపీ చేరారు. అయితే, కూటమిలో భాగంగా, ఆయనకు సీటు కేటాయించలేకపోయారు. అదేసమయంలో జలీల్ ఖాన్కు ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు.