1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Kinjarapu Atchannaidu talk about Stone Attack on YS Jagan

ఎన్నికల్లో లబ్ది కోసమే... వివేకా హత్య - కోడికత్తి కేసు తరహాలోనే రాయిదాడి : అచ్చెన్నాయుడు

atchennaidu
రానున్న ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందేందుకే మాజీ మంత్రి వివేకా, కోడికత్తి కేసుల తరహాలోనే రాయిదాడి కేసు జరిగిందని టీడీపీ ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. శనివారం రాత్రి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చేపట్టిన బస్సు యాత్ర సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేశారు. దీంతో ఆయనకు చిన్నపాటి గాయమైంది. దీనిపై అచ్చెన్నాయుడు స్పందించారు. ఎన్నికల్లో వైకాపా ఓడిపోతుందని తెలిసే జగన్‌ కొత్త నాటకానికి తెరతీశారన్నారు. 
 
విజయవాడ ఘటన ప్రణాళిక ప్రకారం జరిగిందేనని ఆరోపించారు. వివేకా హత్య, కోడికత్తి తరహాలో ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. 'జగన్ పర్యటనలో మూడు గంటల పాటు విద్యుత్‌ లేపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేసుకోలేదు? రోప్‌ పార్టీ ఏమైంది? నాలుగు రోజుల్లో సంచలనాత్మక ఘటన జరుగుతుంది. దీనివల్ల ఎన్నికల్లో చాలా మార్పులు రాబోతున్నాయి. అని నాలుగు రోజుల క్రితం వైకాపా నేత ట్వీట్‌ చేశారు. అతను చెప్పినట్టే సరిగ్గా నాలుగు రోజులకే ప్రణాళిక ప్రకారం ఈ ఘటన జరిగింది' అని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
 
సీఎం జగన్‌పై రాయి పడటం.. అతి చిన్న స్టేజ్‌ డ్రామా అని టీడీపీ నేత వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. ‘ఘటన జరిగిన 10 నిమిషాల్లోనే వైకాపా నేతలు ధర్నా చేశారు. అప్పటికప్పుడు  ప్లకార్డులు ఎలా వచ్చాయి?’ అని ప్రశ్నించారు. ఇలా జరుగుతుందని కొందరు వైకాపా నేతలు, పోలీసులకు ముందే తెలుసన్నారు. 'కరెంట్‌ పోయిన వెంటనే భద్రతా సిబ్బంది చుట్టూ రక్షణ కల్పిస్తారు. కానీ, ముఖ్యమంత్రి ఒక్కరినే నిలబెట్టి... సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు కూర్చున్నారు. ఘటన జరిగిన వెంటనే చంద్రబాబు, లోకేశ్‌పై ఆరోపణలు చేశారు. హత్యాయత్నం చేశాడని ఎవరో ఒకరిని తీసుకొస్తారు. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయాలి. అప్పుడే నిజాలు బయటకు వస్తాయి' అని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. 
About Writer
వరుణ్
తర్వాతి కథనం
భారత్‌లో విపక్షాలు బలహీనపడ్డాయి : ఆర్థికవేత్త అమర్త్య సేన్