శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 జనవరి 2020 (10:35 IST)

కట్నం దాహం చల్లారలేదు... డబ్బులు తెస్తావో... విడాకులిస్తావో నీ యిష్టం...

కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భార్యను కట్టుకున్న భర్త కట్నం పేరుతో వేధించసాగాడు. పెళ్లి సమయంలో లక్షలాది రూపాయల విలువ చేసే కట్నకానుకలు ఇచ్చినప్పటికీ... అతని కట్నందాహం మాత్రం తీరలేదు. దీంతో కట్నం తెస్తావో... విడాకులిస్తావో డిసైడ్ చేసుకోమంటూ భార్యకు ఓ ఆఫర్ ఇచ్చాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా పెనమలూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కానూరుకు చెందిన పొర్లికొండ నాగ వెంకట హైందవి, హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మిరదొడ్ల రఘురామ్ భార్యాభర్తలు. వీరికి ఐదేళ్ళ క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.10 లక్షల నగదు, రూ.28 తులాల బంగారం, మూడెకరాల పొలాన్ని కట్నం కింద ఇచ్చారు. 
 
పెళ్లైన కొన్నాళ్లకే రఘురామ్, అత్తమామలు, ఆడపడుచు హైందవిని వేధించడం మొదలుపెట్టాడు. ఉద్యోగం మానేయాలని, పుట్టింటి వారితో మాట్లాడొద్దని వేధిస్తూ అదనపు కట్నం తీసుకురావాలని ఒత్తిడి తీసుకొచ్చేవారు. తీసుకురాకుంటే పుట్టింటివారిపైనా నిందలు వేసి బజారుకీడుస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో ఆమెను బెదిరించి విడాకుల పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు.
 
వారి వేధింపులకు తాళలేని హైందవి పుట్టింటికి చేరుకుంది. మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో భర్త రఘురామ్, అత్త శుభవాణి, మామ సుబ్రహ్మణ్యం, ఆడపడుచు హారిక, ఆమె భర్త గోవర్ధనరావులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.