1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 జనవరి 2020 (15:10 IST)

భర్త స్నేహితుడితో లింకు.. అతనితో భర్తను చంపేసి.. అతనిపైనే నిందలు!

కట్టుకున్న భర్తకు స్నేహితుడుతో భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ తర్వాత తన ప్రియుడుతో కలిసి భర్తను చంపించింది. ఆ నిందను ప్రియుడిపైనే మోపింది. పోలీసులకు కూడా లిఖిత పూర్వక ఫిర్యాదు కూడా చేసింది. ఈ విషయం పోలీసుల విచారణలో వెల్లడైంది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడకు చెందిన ముక్కుట యాదాగౌడ్ (35), సౌజన్య దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. ఐదేళ్ల క్రితం వీరు హైదరాబాద్ నగరానికి వలస వచ్చారు. ప్రైవేటు ఉద్యోగి అయిన యాదాగౌడ్‌కు డీసీఎం డ్రైవర్ షేక్ ఆసీఫ్‌తో స్నేహం ఉంది. 
 
దీంతో తరచూ యాదాగౌడ్ ఇంటికి వచ్చే ఆసీఫ్, సౌజన్య మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం భర్తకు తెలిసి మందలించినా సౌజన్య పట్టించుకోలేదు. పైగా భర్త తనను హింసిస్తున్నాడని, అతని అడ్డు తొలగిపోతే మనం సంతోషంగా ఉండొచ్చంటూ ప్రియుడికి నూరిపోసింది.
 
దీంతో యాదాగౌడ్‌ను చంపేయాలని నిర్ణయించుకున్న ఆసిఫ్ ఈనెల 15వ తేదీన అతని వద్దకు వచ్చి పార్టీ ఉందంటూ చర్చిగా గిల్లాపూర్‌లోని డబుల్ బెడ్ రూం ఇళ్ల వద్దకు తీసుకువెళ్లాడు. అతనితో ఫుల్‌గా మద్యం తాగించి అనంతరం కత్తితో పొడిచి చంపేశాడు. తర్వాత యాదాగౌడ్ ఇంటికి వచ్చి సౌజన్యకు విషయం చెప్పి వెళ్లిపోయాడు.
 
వెంటనే ప్లేట్ ఫిరాయించిన సౌజన్య తన భర్తను ఆసిఫ్ చంపేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ కొత్త మలుపు తిరిగింది. విచారణలో పోలీసులకు ఆసిఫ్ జరిగినదంతా చెప్పడంతో వారు ఆసిఫ్, సౌజన్య కాల్ రికార్డును పరిశీలించారు. దానిలో సౌజన్య ప్రోద్బలంతోనే ఆసిఫ్ హత్యచేశాడని నిర్ధారణ కావడంతో ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. తండ్రి హత్యకు గురికావడం, తల్లి జైలుకెళ్లడంతో పిల్లలు అనాథలుగా మారారు.