శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 అక్టోబరు 2020 (16:23 IST)

ఏపీ కొంపముంచిన కరోనా... తలపట్టుకుంటున్న అధికారులు..?

కరోనా కారణంగా ప్రపంచ దేశాలు నానా తంటాలు పడుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా బాగానే ప్రభావం చూపింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది కరోనా వైరస్. కోవిడ్ కారణంగా తొలి అర్థ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయాలు భారీగా పడిపోయాయి. 
 
2020-2021 ఆర్థిక సంవత్సరానికి సొంత పన్నుల ద్వారా రూ. 70,679 కోట్లను వసూలు చేయాలని, తొలి అర్థ భాగంలో రూ. 35 వేల కోట్ల వసూళ్లు చేయాలని టార్గెట్ ఉండగా.. తొలి ఆరు నెలల కాలంలో కేవలం రూ. 14,962 కోట్లు మాత్రమే వసూళ్లయ్యాయని ఏపీ ఆర్థిక శాఖ పేర్కొంది. టార్గెట్ కంటే సుమారు 57 శాతం తక్కువగా సొంత పన్నుల ఆదాయం ఉంది.. అంటే కేవలం 43 మాత్రమే వసూళ్లు అయినట్టు ఆర్థికశాఖ చెప్తోంది.
 
ఇక, గత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో రూ. 21,967 కోట్ల మేర సొంత పన్నుల ఆదాయం ఉండగా.. గతేడాది కంటే 32 శాతం మేర తక్కువగా ప్రస్తుత ఏడాది ఆదాయాలు నమోదు అయ్యాయి.. రోజు వారీ ఖర్చులకు ఇబ్బందులు తప్పేలా లేవని ఆర్థిక శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో ఆర్థిక శాఖ అధికారులు తలపట్టుకుంటున్నారు.