ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సందీప్
Last Updated : గురువారం, 21 ఫిబ్రవరి 2019 (11:54 IST)

తల్లి బతకదని తెలిసి.. సూసైడ్ నోట్ రాసి బలవన్మరణం..

తల్లికి అనారోగ్యం, వైద్య పరీక్షలు చేయించారు. సమస్య తీవ్రంగా ఉందని, ఎక్కువ కాలం బతకడం కష్టం అని చెప్పడంతో ఓ కుమారుడు కలత చెందాడు. తల్లి దక్కదనే భయంతో, నిరాశతో లేఖ వ్రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మట్టెవాడ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
 
వరంగల్‌ పోతననగర్‌కు చెందిన సాంబయ్య భార్య ఉమాదేవీకి కొద్ది కాలంగా గుండె సంబంధిత వ్యాధి ఉంది. ఇటీవల ఆమె తీవ్ర అనారోగ్యం పాలవ్వడంతో ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షించి వ్యాధి ముదిరిపోయిందని, ఎక్కువ కాలం బతకడం కష్టమని తేల్చిచెప్పారు. దాంతో కుమారుడు శ్రావణ్‌కుమార్‌ (24) ఆవేదనకు గురై కృంగిపోయాడు. ఈ నెల 18వ తేదీ రాత్రి తల్లికి ఇచ్చిన మందులతోపాటు, నిద్ర మాత్రలు కూడా మింగాడు. పరిస్థితి విషమం కావడంతో కుటుంబ సభ్యులు బాధితుడిని ముందుగా ఎంజీఎంకు ఆ తర్వాత ప్రైవేటు ఆసుపత్రికి తరలించాడు. 
 
అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. అతను వ్రాసిన లేఖలో 'అమ్మా నువ్వంటే నాకు ప్రాణం, నీకు హృద్రోగమని, నువ్వు ఎన్నాళ్లో బతకవని డాక్టర్లు చెప్పారు. నీ చావును నేను చూడలేను. నువ్వులేని లోకంలో నేను ఉండలేను. అందుకే నీకన్నా ముందే నేను ఈ లోకం వీడి వెళ్లిపోతున్నాను. ఐ లవ్‌ యూ అమ్మా' అని వ్రాసి ఉంది. 
 
తల్లి కంటే ముందే కొడుకు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. తల్లి ఆరోగ్యం మరింత క్షీణించింది. శ్రావణ్‌కుమార్‌ పట్టణంలోని ఆదర్శ న్యాయ కళాశాలలో న్యాయ విద్య ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.