1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 28 సెప్టెంబరు 2023 (16:01 IST)

యువగళం పాదయాత్ర మళ్లీ వాయిదా... ఎందుకంటే...

nara lokesh
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుక్రవారం రాత్రి నుంచి పునఃప్రారంభించనున్న యువగళం పాదయాత్రను వాయిదా పడింది. తన తండ్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్‍‌పై అక్టోబరు మూడో తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. దీంతో యువగళం పాదయాత్ర పునఃప్రారంభ తేదీని వాయిదా వేసుకోవాలని పార్టీ ముఖ్యనేతల సూచన మేరకు వాయిదా వేసుకున్నారు. 
 
స్కిల్ డెవలప్‌‍మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టు, అనంతర పరిణామాల నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన ఉన్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో పాదయాత్రను నిలిపివేసిన విషయం తెల్సిందే. దాదాపు 20 రోజుల తర్వాత ఈ నెల 29వ తేదీ శుక్రవారం రాత్రి 8.15 గంటలకు తిరిగి పునఃప్రారంభించాలని నిర్ణయించారు. కానీ, అక్టోబరు 3వ తేదీన సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ జరుగనున్న నేపథ్యంలో తన పాదయాత్రను వాయిదా వేశారు. 
 
కక్ష సాధింపుతో అనేక కేసులు తెరపైకి తీసుకొచ్చి పార్టీ అధినేత చంద్రబాబుని ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నందున ఢిల్లీ  న్యాయవాదులతో లోకేశ్ సంప్రదింపులు చేయాల్సిన అవసరముందని నేతలు అభిప్రాయపడ్డారు. పాదయాత్రలో ఉంటే న్యాయవాదులు సంప్రదింపులు, ఇతర కార్యక్రమాల పర్యవేక్షణ కష్టం అవుతుందని వారు అభిప్రాయపడ్డారు. అందుకే ఈ పాదయాత్రను వాయిదా వేశారు., త్వరలోనే నాయకులతో చర్చించి యువగళం పునఃప్రారంభ తేదీని ప్రకటించనున్నారు.