1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: బుధవారం, 5 మే 2021 (22:26 IST)

భయం వద్దు, అపోహలొద్దు, ఫస్ట్ డోస్ వేసుకున్నవారందరికీ సెకండ్ డోస్: అనిల్ కుమార్ సింఘాల్

అమరావతి: రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ అందరికీ సెకండ్ డోస్ వేస్తామని, ఎటువంటి భయాందోళనలకు, అపోహాలకు గురికావొద్దని రాష్ట్ర వైద్య, ఆరోగ్య ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ కోరారు. ఈ నెలలో కేంద్రమిచ్చే డోస్ లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేసే డోస్ లను నిర్ధేశించిన సమాయానికే సెకండ్ డోస్ కు వినియోగిస్తామని, వారికి వేయగా మిగిలితే ఫస్ట్ డోస్ గా టీకాలు వేస్తామని స్పష్టం చేశారు.

ప్రభుత్వాసుపత్రులతో పాటు ప్రభుత్వ అనుమతులు పొందిన ప్రైవేటు ఆసుపత్రుల్లో రెమిడెసివిర్, ఆక్సిజన్ కొరత లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 24 గంట్లో 1,16,367 కరోనా టెస్టులు నిర్వహించగా, 22,204 పాజిటివ్ కేసుల నమోదయ్యాయని, 85 మంది మృతిచెందారని ఆయన తెలిపారు.

గడిచిన 24 గంటల్లో 387 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను ప్రభుత్వాసుపత్రులకు, ప్రైవేటు ఆసుపత్రులకు సప్లయ్ చేశామన్నారు. ఆక్సిజన్ కొరత రాబోతున్నదని నెల్లూరు జిల్లాలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు... సంబంధిత జిల్లా కలెక్టర్  దృష్టికి తీసుకురాగానే. సతీష్ దావన్ శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) సాయంతో 12 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ను ఆయా ఆసుపత్రులకు సకాలంలో అందజేశామన్నారు. ఆక్సిజన్ సరఫరాలో జాప్యం జరకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు.  ప్రభుత్వాసుపత్రుల్లో రెమిడెసివిర్ 15,037 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

నేటి సాయంత్రం(బుధవారం) మరో 12 వేల వాయిల్స్ అందజేస్తున్నామన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 11,556 రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 5,248 ఇంక్షన్లను ప్రైవేటు ఆసుపత్రులు కొనుగోలు చేసుకున్నారన్నారు. ప్రభుత్వం వద్ద అనుమతులు పొందిన 206 ఆసుపత్రులకు 6,308 డోసుల సప్లయ్ చేశామన్నారు

. ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్య శాఖ మంత్రి) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ అధ్యక్షతన కొవిడ్ నియంత్రణకు ఏర్పాటైన మంత్రి వర్గ ఉప సంఘం కమిటీ సమావేశం జరిగిందన్నారు. కొవిడ్ పై గురువారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేయనున్నారన్నారు. హెల్ప్ డస్క్ ల పనితీరుపై సీఎంకు నివేదిక ఇవ్వనున్నామన్నారు.
 
కాల్ సెంటర్లో పెరిగిన వైద్యుల రిజిస్ట్రేషన్ సంఖ్య...
కాల్ సెంటర్ ద్వారా కరోనా బాధితులకు సేవలు అందించడానికి అధిక సంఖ్యలో డాక్టర్లు ముందుకొస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కారద్యర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కరోనా బాధితులకు ఫోన్ ద్వారా సలహాలు సూచనలు అందించాలని కోరినప్పుడు తొలుత 200 మంది డాక్టర్లు మాత్రమే తమ పేర్లను రిజస్టర్ చేసుకున్నారన్నారు. ప్రస్తుతం 3,220 డాక్టర్లు... కరోనా బాధితులకు ఫోన్ల ద్వారా సేవలందించడానికి ముందుకొచ్చారన్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఎలా ఉండాలి... తక్కువ లక్షణాలు ఉన్నప్పుడు ఏవిధమైన మందులు వాడాలి... తీవ్రంగా ఉన్నపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి...? అనే వివరాలను కరోనా బాధితుకలు ఫోన్ ద్వారా తమ ఇళ్ల నుంచే డాక్టర్లు సలహాలు సూచనలు అందజేస్తున్నారన్నారు.
 
గడిచిన 24 గంటల్లో కాల్ సెంటర్ కు 17,190 కాల్స్ వచ్చాయన్నారు. వాటిలో వివిధ రకాల సమాచారాల నిమిత్తం 5,949, ఆసుపత్రుల్లో అడ్మిషన్లకు 4,229, కరోనా టెస్టుల కోసం 3,737, టెస్టుల ఫలితాలకు 2,042 ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు.
 
ప్రజల్లో చైతన్యం కలిగించేలా కర్ఫ్యూ అమలు...
రాష్ట్రంలో బుధవారం ఉదయం నుంచి రెండు రకాల కొవిడ్ మార్గదర్శకాలను అమల్లోకి వచ్చాయని ఆయన తెలిపారు. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ సాధారణ జీవనానికి ఆటంకం లేకుండా 144 సెక్షన్, మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్నామన్నారు. మొదటి రెండు రోజులు కొవిడ్ మార్గదర్శకాలపై ప్రజల్లో అవగాహన లోపం ఉంటుందని, ఎవరికీ ఇబ్బందులు పెట్టొద్దని జిల్లా అధికారులను, కలెక్టర్లను ఆదేశించామన్నారు.

ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులతో పాటు ముందుగానే నిర్ణయించుకున్న పెళ్లి తదితర కార్యక్రమాల నిర్వహణ, రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఎటువంటి చర్యలు తీసుకోవాలనేదానిపైనా గైడ్ లైన్స్ ను రూపొందించామన్నారు.కొవిడ్ మార్గదర్శకాలపై జిల్లా అధికారులతో ఏరోజుకారోజు సమీక్షలు చేస్తామన్నారు.

ప్రభుత్వం నిర్ధేశించిన సమయాల్లో బ్యాంకలు పనిచేయాలన్నారు. ఎవరికీ ఇబ్బందులు కలుగకుండా ఉండేలా గతంలో మాదిరిగా లాక్ డౌన్ కాకుండా కర్ఫ్యూ అమలు చేస్తున్నామన్నారు. ఆరోగ్య శ్రీ పేషంట్లకు ఇబ్బందులు లేకుండా చూడడంతో పాటు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయల కల్పనపైనా జిల్లా అధికారులతో మాట్లాడి సీఎంకు నివేదిక అందజేస్తామన్నారు.
 
రాష్ట్రానికి ఇతర దేశాల సాయమందించిన కేంద్రం... 
ఇతర దేశాల నుంచి వస్తున్న విరాళాలను కేంద్ర ప్రభుత్వం...వివిధ రాష్ట్రాలకు పంపుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇందుకోసం ప్రతి రాష్ట్రం ఒక నోడల్ అధికారిని నియమించాలని కేంద్ర ప్రభుత్వం తెలిపిందన్నారు. ఆంధ్రప్రదేశ్ కు 4,879 రెమిడెసివిర్ ఇంజక్షన్లను, 2, 107 ఆక్సిజన్ పరికరాలను, 1, 92,058 లక్ష ర్యాపిడ్ కిట్లతో పాటు మరికొన్నింటిని కేంద్ర ప్రభుత్వం అందజేసిందన్నారు.
 
నిర్ధేశిత సమయానికే సెకండ్ డోస్ వేస్తాం...భయం వద్దు... 
సెకండ్ డోస్ వేస్తారో...లేదో...అనే అనుమానం, భయాందోళనలు వద్దని ఆయన భరోసా ఇచ్చారు. మొదటి డోస్ తీసుకున్న వాళ్లందరికీ సెకండ్ డోస్ వేసి తీరతామన్నారు. కోవాగ్జిన్ కు నాలుగు వారాలు, కొవిషీల్డ్ 6 నుంచి 8 వారాల టైమ్ లిమిట్ దాటకుండా సెకండ్ డోస్ వేస్తామన్నారు. సెకండ్ డోస్ వేయగా మిగిలిన డోస్ లనే ఇతరులకు ఫస్ట్ డోస్ గా వేస్తామన్నారు. వ్యాక్సిన్ కోసం బ్యాంకు, ఏపీఆర్టీసీ, సివిల్ సప్లయ్ కార్పొరేషన్, తమకు వ్యాక్సిన్ ఇవ్వాలని కోరుతున్నారన్నారు. ఈ నెల 15లోగా కేంద్ర ప్రభుత్వం నుంచి 9 లక్షల డోస్ లు, 13 లక్షల డోస్ లను  రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేయనుందని, ఈ మొత్తం 19 లక్షల డోస్ లను సెకండ్ డోస్ లుగా వేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.