బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (17:58 IST)

సీఎం జగన్‌కు పోయేకాలం దాపురించింది : సీపీఐ రామకృష్ణ

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న మొండివైఖరితో పాటు.. ఆయన సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలపై విపక్ష పార్టీలన్నీ మాటల యుద్ధం ప్రారంభించాయి. జగన్‌కు పోయేకాలం దాపురించిందంటూ మండిపడుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న వాస్తవ పరిస్థితిని వైద్యులు చెబితే.. వారిపై వేటు వేస్తారా అంటూ నిలదీస్తున్నాయి. 
 
ఇదే అంశంపై సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ, సీఎం జగన్‌ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించిందన్నారు. 'మాస్క్‌లు లేవన్నందుకు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తున్నారు. కరోనా విజృంభిస్తుంటే ఎన్నికలు ఆపించి రమేష్‌ మంచి నిర్ణయం తీసుకున్నారు. తన మాట విననందుకు రమేష్‌కుమార్‌పై జగన్‌ కక్షగట్టారు. చెప్పినట్టు వింటే రమేష్ కులం కూడా జగన్‌కు కనిపించేది కాదు. రమేష్‌ కుమార్‌ను తొలగించే అధికారం జగన్‌ ప్రభుత్వానికి లేదు. ఎస్‌ఈసీని తొలగించే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉంది. ప్రపంచమంతా కరోనా ఉంటే.. జగన్‌ కొత్త వైరస్‌ కనిపెడుతున్నారు' అంటూ మండిపడ్డారు. 
 
రోమ్‌ చక్రవర్తిలా సీఎం జగన్‌ తీరు ఉందని జనసేన లీగల్‌ సెల్‌ నేత గాదె వెంకటేశ్వర్లు ఆక్షేపించారు. ప్రపంచమంతా కరోనా విజృంభిస్తుంటే ఏమీ పట్టించుకోకుండా.. జగన్‌ కక్షపూరిత నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. జగన్‌ ప్రభుత్వ నిర్ణయాలన్నీ చట్ట విరుద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్‌లో 13 జిల్లాలను కూడా వాళ్ల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకుంటారని వెంకటేశ్వర్లు దుయ్యబట్టారు.