గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 నవంబరు 2019 (08:58 IST)

నన్ను తిడితే ఇసుక కొరత తీరదు.. ఎన్ని అన్నా నా ఒళ్లు చావదు : పవన్ కళ్యాణ్

వ్యక్తిగతగా తనను లక్ష్యంగా చేసుకుని తిడితే రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఇసుక కొరత తీరదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖలో ఆయన సారథ్యంలో జరిగిన లాంగ్ మార్చ్‌పై వైకాపా నేతలు విమర్శలు చేసిన విషయం తెల్సిందే. 
 
వీటికి పవన్ కౌంటరిచ్చారు. 'విశాఖపట్నంలో లాంగ్‌ మార్చ్‌ నిర్వహిస్తే.. ఊహించనంత మంది వచ్చారు. అంటే సమస్య అంత తీవ్రంగా ఉందని అర్థం. దానిని ముందు పరిష్కరించడానికి జగన్‌ ప్రభుత్వం ప్రయత్నించాలి. నన్ను తిడితే లాభం లేదు.. ఎన్ని అన్నా నా ఒళ్లు చావదు' అని అన్నారు. 
 
సమస్యను పరిష్కరించకుండా తనను తిడితే వైసీసీ నాయకులే ప్రజల్లో విశ్వాసం కోల్పోతారని తేల్చిచెప్పారు. వారు ఇసుకలో ఇంకేదో బెనిఫిట్‌ వెదుకుతున్నారని వ్యాఖ్యానించారు. ఇసుక లభించక భవన నిర్మాణ కార్మికులు ఐదు నెలలుగా ఇబ్బందులు పడుతున్నారు. అధికారికంగా పది మంది వరకు చనిపోగా.. అనధికారికంగా 50 మంది వరకు ఆత్మహత్య చేసుకున్నారు. 
 
సమస్యపై ఇంతమంది గళమెత్తి రోడ్ల మీదకు వస్తే.. ప్రజల్లో ఆగ్రహావేశాలు రెచ్చగొడుతున్నానని ఆరోపించడం తగదు. 151 సీట్లు గెలుపొందిన పార్టీ వైసీపీ ఈ ఐదు నెలల్లో సుపరిపాలన అందిస్తే జనసేన మీటింగ్‌కు అంత మంది ఎందుకు వస్తారో ఆలోచించాలి అని అన్నారు.