మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (21:48 IST)

నిద్రమత్తు వీడండి.. లేదంటే కర్నూలు కోలుకోవడం కష్టం : పవన్ కళ్యాణ్

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే విషయంలో రాష్ట్ర యంత్రాంతం ముఖ్యంగా కర్నూలు జిల్లా అధికారులు ఇప్పటికైనా నిద్రమత్తును వీడాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో కరోనా వైరస్ కోరల్లో చిక్కుకున్న కర్నూలు కోవడం చాలా కష్టమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా వ్యాధి జిల్లాలో వ్యాప్తి చెందడానికి గల కారణాలు, తప్పులను అణ్వేషించడంలో జనసేన పార్టీకి ఎలాంటి ఆసక్తి లేదని గుర్తుచేశారు. అయితే ప్రజల ఆరోగ్యమే జనసేన ఆకాంక్ష అని, ఈ సమస్య అందరిదన్నారు. ఒక్క కర్నూలులోనే 203 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఐదుగురు చనిపోయారని చెప్పుకొచ్చారు. 
 
ఇన్ని కేసులు ఒక్క జిల్లాలోనే నమోదవడం చూస్తుంటే పరిస్థితి ఎంత తీవ్రంగా అర్థం చేసుకోవచ్చునని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని కర్నూలుకు ప్రత్యేక బృందాలను పంపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే, కర్నూలు జిల్లా వాసుల్లో మనోధైర్యాన్ని నింపాలని ఆయన కోరారు. 
 
మరోవైపు, కరోనా వైరస్ బారినపడిన రోగులకు తమ ప్రాణాలు ఫణంగా పెట్టి చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందిని, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన రక్షణ పరికరాలు, ఇతర సహాయ సహకారాలను అందించాలని కోరారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం మేల్కొనకపోతే పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఉందన్నారు. కర్నూలు జిల్లా పరిస్థితిపై జనసేన స్థానిక నాయకులతో పాటు సీనియర్ రాజకీయవేత్త, బీజేపీ నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ తనకు లేఖలు రాశారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు.