పోసాని కృష్ణమురళికి తేరుకోలేని షాకిచ్చిన హైకోర్టు... ఎలా?
సినీ రచయిత, సినీ నటుడు, వైకాపా నేత పోసాని కృష్ణమురళి ఏపీ హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. ఆయన బుధవారం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. సీఐడీ పీటీ వారెంట్ను రద్దు చేయాలని కోరుతూ పోసాని తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు నిర్ణయంతో పోసాని తీవ్ర నిరాశకు లోనుకావడంతో పాటు ఆయనకు బెయిల్ మంజూరైనప్పటికీ విడుదల కాలేని పరిస్థితి నెలకొంది.
కాగా, ఈ లంచ్ మోహన్ పిటిషన్పై జరిగిన విచారణలో పోసానిని ఇప్పటికే పీటీ వారెంట్పై కర్నూలులో సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టుకు తెలిపారు. ఆయనను మంగళగిరి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచేందుకు కర్నూలు నుంచి తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఇరువైపులా వాదనలు ఆలకించిన కోర్టు.. పోసాని పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పునిచ్చారు. దీంతో పోసానికి కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఏపీ సీఐడీ పీటీ వారెంట్ : పోసాని కృష్ణమురళి విడుదలకు బ్రేక్
వైకాపా నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళి జైలు నుంచి విడుదలయ్యేందుకు అంతరాయం ఏర్పడింది. పోసానిపై సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ వేశారు. ఆయన కోసం గుంటూరు సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలు వద్దకు వెళ్లారు. పీటీ వారెంట్పై పోసాని కోర్టు ముందు హాజరుపరచనున్నారు. జైలు నుంచే వర్చువల్గా జడ్జి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. పోసాని కృష్ణమురళిపై నమోదైన కేసుల్లో ఇప్పటికే లభించింది. దీంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది. తాజాగా సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ వేయడంతో పోసాని విడుదలకు బ్రేక్ పడింది.
ఇదిలావుంటే, పోసానికి కర్నూలు కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసిన విషయం తెల్సిందే. కర్నూలు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోసాని బెయిల్ పిటిషన్పై ఐదు రోజుల పాటు కోర్టులో వాదనలు జరిగాయి.
చివరకు రూ.20 వేల పూచీకత్తు, ఇద్దరు వ్యక్తుల జామీనుతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. భవానీపురం కేసులోనూ విజయవాడ కోర్టు పోసానికి బెయిల్ వచ్చింది. దీంతో పోసాని బుధవారం ఉదయం జైలు నుంచి విడుదల కావాల్సివుంది. అయితే, సీఐడీ అధికారులు పీటీ వారెంట్ వేయడంతో ఆయన విడుదలకు అంతరాయం ఏర్పడింది.