1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 15 జులై 2021 (20:42 IST)

శ్రీనివాసా కాపాడు, తిరుమలలో చిరుతలు.. పాములు

లాక్ డౌన్ కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గిన విషయం తెలిసిందే. ఈమధ్యే భక్తుల రద్దీ కాస్త పెరుగుతోంది. అయితే భక్తుల సందడి లేకపోవడం.. తిరుమల నిర్మానుష్యంగా మారిపోవడం.. ఘాట్ రోడ్లలో వాహన రాకపోకలు తక్కువగా ఉండడంతో జంతువులు రోడ్లపైకి వచ్చేస్తున్నాయి.
 
గత వారం చిరుత పులులు భక్తులకు కనిపించిన విషయం తెలిసిందే. రెండవ ఘాట్ రోడ్డులోని వినాయకుని గుడి దగ్గర చిరుత రోడ్డు దాటుతూ భక్తుల సెల్ ఫోన్‌కు దొరికింది. అలాగే  తిరుమలలోని సన్నిధానం సదన్-2 దగ్గర చిరుత ప్రత్యక్షమైంది. చిరుతపులుల తిరుగుతుండటంతో  భక్తులు భయాందోళనకు గురయ్యారు. 
 
అయితే తాజాగా పాములు కూడా భక్తులు తిరిగే ప్రాంతంలోకి వచ్చేస్తున్నాయి. తిరుమలలోని జిఎన్‌సి టోల్ గేట్ వద్ద అతి పెద్ద నాగుపాము రోడ్డుపైకి వచ్చేయడంతో భక్తులు గుర్తించి టిటిడి విజిలెన్స్ అధికారులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన టిటిడికి చెందిన పాములు పట్టే భాస్కర్ అక్కడికి చేరుకున్నారు.
 
అయితే నాగుపాము బుస్సలు కొడుతూ అక్కడి నుంచి వేగంగా వెళుతూ కనిపించింది. దీంతో పాముల భాస్కర్ నాగుపామును పట్టుకుని దట్టమైన అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళి వదిలేశాడు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుమలలోని శేషాచలం అటవీ ప్రాంతంలో ఉండే జంతువులన్నీ రోడ్లపైకి వచ్చేస్తుండటంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.