శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 నవంబరు 2020 (07:52 IST)

సొంత ఆస్పత్రిలోనే కరోనా సోకి తెదేపా మాజీ ఎమ్మెల్యే మృతి!

చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కన్నుమూశారు. ఆమెకు కరోనా వైరస్ సోకడంతో బెంగుళూరులోని తన సొంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె వయస్సు 70 యేళ్లు. ఈమె తెదేపా జాతీయ ఉపాధ్యక్షురాలు కూడా. 
 
గత నెల 10వ తేదీన ఆమెకు కరోనా వైరస్‌ సోకడంతో సొంత ఆస్పత్రి అయిన బెంగళూరులోని వైదేహీలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అప్పటి నుంచి ఐసీయూలో ఉన్న ఆమె ఆరోగ్య పరిస్థితి ఈ నెల 3వ తేదీ నుంచి విషమంగా మారడంతో వెంటిలేటర్‌ మీద ఉంచారు. అయితే, గురువారం రాత్రి ఆమె కన్నుమూసినట్టు ఆస్పత్రి యాజమాన్యం వెల్లడించింది. 
 
కాగా, చిత్తూరు జిల్లా సదుం మండలానికి చెందిన సత్యప్రభ 1951 సెప్టెంబరు 21న జన్మించారు. బెంగళూరులో మెట్రిక్యులేషన్‌ దాకా చదివారు. విద్యార్థిగా వున్నప్పటినుంచే ఆమె పుట్టపర్తి సాయిబాబాకు భక్తురాలు. చిత్తూరు షుగర్‌ ఫ్యాక్టరీలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న డీకే ఆదికేశవులును వివాహం చేసుకున్నారు. 
 
అప్పటివరకు సాధారణ ఉద్యోగి, వ్యాపారవేత్తగా ఉన్న ఆదికేశవులు పెళ్లి తర్వాత పారిశ్రామికవేత్తగా ఎదిగారు. కాంగ్రెస్‌లో పేరున్న నాయకుడిగా ఎదిగిన ఆయన 2004లో టీడీపీ తరపున చిత్తూరు ఎంపీగా గెలిచారు. టీటీడీ ఛైర్మన్‌గా రెండుసార్లు పనిచేశారు.2009లో ఆదికేశవులు అనారోగ్యంతో మరణించాక గృహిణిగా ఉన్న సత్యప్రభ రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో టీడీపీ తరపున చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచారు.