ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 29 నవంబరు 2020 (18:39 IST)

సిగ్గు లేని ప్రభుత్వం.. జగన్ పై టీడీపీ ఫైర్

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్నిఆర్థికాభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపినట్లు, టూరిజంలోకూడా ఏపీ మంచి పురోగతి సాధించినట్లు, ప్రభుత్వానికి బాకాఊదే సొంతపత్రిక సాక్షిలో రాశారని, టీడీపీ జాతీయఅధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు.

ఆదివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.  ఇండియాటుడే సంస్థవారు స్టేట్ ఆఫ్ దిస్టేట్స్అని ఏటా సర్వే చేస్తుంటారని, దానిలో రెండు కేటగిరీలుంటాయని, ఒకటి బెస్ట్ పెర్ ఫార్మింగ్ కేటగిరీ అయితే, మరోటి మోస్ట్ ఇంప్రూవ్డ్ కేటగిరీ అని పట్టాభి పేర్కొన్నారు. దేశంలోని రాష్ట్రాలను పెద్ద, చిన్న కేటగిరీలుగా విభజించి, రెండు కేటగిరీల్లోర్యాంకులు ఇస్తుంటారన్నారు.

ఏపీ ప్రభుత్వం, తనపాలనలో ఏదో ఘనత సాధించినట్లుగా జగన్మోహన్ రెడ్డి, ఆయన సొంతపత్రికలో డబ్బాలు కొట్టుకున్నారని, కానీ ఇండియాటుడే సంస్థ, ఇప్పుడు ప్రకటించినర్యాంకులు గత ఐదేళ్లకాలంలో రాష్ట్రంలో జరిగిన పనితీరుని ప్రామాణికంగా తీసుకొని ప్రకటించ డం జరిగిందన్నారు.  జగన్మోహన్ రెడ్డి ఏడాదిన్నర పాలననే పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకులు ప్రకటించలేదని పట్టాభి స్పష్టంచేశారు.

మోస్ట్ ఇంప్రూవుడ్ కేటగిరీలో ఏపీకి వచ్చిన ర్యాంకు 2019-20 కాలానికి వచ్చింది కాదనే విషయాన్ని ముఖ్యమంత్రి తెలుసుకుంటే మంచిదని పట్టాభి సూచించారు.  2014 – 2019మధ్యన, చంద్రబాబునాయుడి పాలనలో రాష్ట్రం సాధించిన ప్రగతికి కొలమానంగానే, ఇప్పుటి ర్యాంకులను ఇండియాటుడే రాష్ట్రానికి ప్రకటించిందనే కఠోర సత్యాన్ని జగన్, ఆయనప్రభుత్వం అంగీకరించి తీరాలన్నారు.

ముందుగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి గురించి చెప్పుకుంటే, 2018-19లో ఒకలక్షా51వేల173రూపాయలు తలసరి ఆదాయం ఉంటే, 2019-20కి వచ్చే సరికి లక్షా69వేలకు పెరిగిందని ఇండియాటుడేలో చెప్పడం జరిగిందని పట్టాభి వివరించారు. దాదాపుగా రూ.18వేలవరకు తలసరి ఆదాయం పెరిగినట్టు చెప్పిందన్నారు. 

జూలై 10, 2019న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర ఆర్థికరంగానికి సంబంధించి విడుదలచేసిన శ్వేతపత్రం లోని పేరాగ్రాఫ్ 3లో మాత్రం 2017-18లో లక్షా 43వేల935రూపాయలుగా ఉన్న తలసరి ఆదాయం, 2018-19కి వచ్చేసరికి రూ.లక్షా64వేల025కు చేరుకుందని  చెప్పడం జరిగిందన్నారు.

ఇప్పుడు ఇండియాటుడేకు ప్రభుత్వం ఇచ్చిన సమాచారంలో మాత్రం 2018-19లో లక్షా 64వేలుగా ఉన్న తలసరిఆదాయం, ఇండియాటుడేకు ఇచ్చిన సమాచారంలో మాత్రం రూ.లక్షా 51వేల173 అని తప్పుడు సమాచారం ఇవ్వడమేంటని పట్టాభి నిలదీశారు.

గత ప్రభుత్వహయాంలో 2013-14లో రూ.82,870గా ఉన్న రాష్ట్ర  తలసరిఆదాయం, 2018-19నాటికి  రూ.లక్షా64వేల 025కు తీసుకెళ్లి, ఐదేళ్లలోనే తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేసిన ఘనత చంద్రబాబునాయుడికి దక్కిందన్నారు. ఈ నిజాన్ని వైసీపీప్రభుత్వమే ఒప్పుకుందని, ఏమీ సాధించకుండానే, అంతా తమప్రభుత్వమే సాధించినట్లు సిగ్గులేకుండా సొంతపత్రికల్లో ఎలా రాసుకుంటారని పట్టాభి మండిపడ్డారు.

ఈ ప్రభుత్వం వచ్చినతరువాత తలసరి ఆదాయం కేవలం రూ.5వేలు మాత్రమే పెరిగిందని, దానికే రాష్ట్రం ఆర్థికాభివృద్ధిలో తొలిస్థానం సాధించినట్లు, వైసీపీపాల కులు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారన్నారు.

ఇండియాటుడే పత్రిక గతఐదేళ్లప్రగతిని కొలమానంగా తీసుకున్నట్లు స్పష్టంగా చెప్పినా కూడా జగనన్న సాధించిన ఘనత అని ఎలా చెప్పుకుంటారన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి రూపాయికూడా పెట్టుబడిరాలేదని, వ్యవసాయం సహా అనేక రంగాలు సర్వనాశనమైపోయాయని పట్టాభి మండిపడ్డారు. 

ఇండియాటుడే పత్రిక గడచిన ఐదేళ్లపాలనను కొలమానంగా తీసుకుందని, ఇప్పుడున్న ప్రభుత్వపనితనాన్ని అస్సలు లెక్కలోకే తీసుకోలేదని పట్టాభి తేల్చిచెప్పారు.