బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 14 నవంబరు 2020 (15:58 IST)

ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు

ఏపీ ప్రభుత్వం అనుమతి లేకుండా కొన్ని కాలువలు ఆధునీకరించడం, సామర్థ్యం పెంపు వంటి పనులు చేపడుతోందని.. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది.
వాటిని నిలువరించడానికి చర్యలు తీసుకోవాలని కోరింది.
 
ఆంధ్రప్రదేశ్‌లోని నీటి పారుదల ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. అనుమతి లేకుండా కొన్ని కాలువలు ఆధునీకరించడం, సామర్థ్యం పెంపు వంటి పనులు చేపడుతోందని.. వాటిని నిలువరించడానికి చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు ఆ రాష్ట్ర నీటి పారుదలశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌.. కృష్ణా బోర్డు కార్యదర్శకి లేఖ రాశారు.
 
పోతిరెడ్డిపాడు నుంచి ఆమోదం లేకుండానే 35 వేల క్యూసెక్కుల నీటిని అదనంగా తీసుకునేలా.. నది విస్తరణ పనులపై చర్యలు తీసుకోవాలని లేఖ రాసినా.. కొత్త పనులు చేపట్టిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కర్నూలులోని తుంగభద్ర నది కుడివైపు గుండ్రేవుల వద్ద.. పులకుర్తి ఎత్తిపోతల పథకం సర్వే మెుదలుకొని, నిర్మాణం,15 సంవత్సరాల నిర్వహణకు గతనెల 16న ఏపీ ఉత్తర్వు జారీ చేసిందని.. నీరు శ్రీశైలానికి రాకుండ మళ్లించనున్నట్లు లేఖలో తెలిపింది.
 
గుంటూరు జిల్లా దుర్గి వద్ద నాగార్జున సాగర్‌ కుడికాలువపై బుగ్గవాగు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని.. 3.4 టీఎంసీల నుంచి 7 టీఎంసీలకు పెంచేందుకు.. డీపీఆర్​ తయారీకి ఉత్తర్వు ఇచ్చిందని.. దీనివల్ల కేటాయించిన నీటికంటే ఎక్కువ వాడుకునే అవకాశం ఉందని వివరించింది.
 
నాగార్జున సాగర్‌ కుడి, ఎడమ కాలువల కింద ఆంధ్రప్రదేశ్​కు చేసిన కేటాయింపులపై ఇప్పటికే బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ దృష్టికి తీసుకెళ్లింది. కుడి, ఎడమ కాలువ అవసరాలకు గోదావరి జలాలను వినియోగించుకోవచ్చని తెలిపింది. పై ప్రాజెక్టులన్నీ ఏపీ 2014 తర్వాత బోర్డు, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా చేపడుతోందని లేఖలో పేర్కొంది. ఈ పనులు నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది.