1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2020 (08:44 IST)

ఇంటికే బతుకమ్మ చీరలు..తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం?

బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని అక్టోబరు మొదటి వారంలో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కరోనా నేపథ్యంలో చీరలను నేరుగా మహిళల ఇళ్లకే తీసుకెళ్లి అందజేయాలని భావిస్తోంది.

ఏటా బతుకమ్మ పండుగ సందర్భంగా కోటి మంది పేద మహిళలకు ప్రభుత్వం చీరలను పంపిణీ చేస్తోంది. ఈ ఏడాదీ కోటి చీరలు సిద్ధమవుతున్నాయి. బతుకమ్మ సంబురాలకు వారం లేదా పది రోజుల ముందు చీరలను పంపిణీ చేయడం ఆనవాయితీ.

ఈ ఏడాది అక్టోబరు మొదటి వారంలో వాటిని అందజేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతంలో రేషన్‌షాపుల ద్వారా చీరలు అందజేశారు. ఆహారభద్రత కార్డులు తీసుకెళ్తే సంతకాలు తీసుకొని చీరలు ఇచ్చేవారు.
 
ఈ సారి కరోనా దృష్ట్యా నేరుగా ఇళ్లకే పంపిణీ చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. నగర, పురపాలక సంస్థలు, గ్రామ పంచాయతీల పరిధిలోని సిబ్బంది, మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిసింది.

రేషన్‌ రిజిస్టర్లు, ఆహారభద్రత కార్డులను సరిచూసుకొని చీరలు అందజేస్తారు. పంపిణీ విధానంపై త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే ఉన్నతస్థాయి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీని ఆధారంగా మార్గదర్శకాలు జారీ అవుతాయి.