శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (14:38 IST)

హైదరాబాద్ నగరంలో కరోనా ఫీవర్.. నిండిపోతున్న ఆస్పత్రులు

చైనాతో పాటు పలు ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న కరోనా వైరస్ ఇపుడు హైదరాబాద్ నగరంలో కూడా కలకలం రేపుతోంది. ముఖ్యంగా, పలువురికి ఈ వైరస్ సోకిందనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దీనికితోడు పలు ప్రభుత్వ ఆస్పత్రులను సిద్ధం చేసివుంచారు. ఈ క్రమంలో జ్వరం, తలనొప్పి, జలుబుతో బాధపడుతున్న వారంతా తమకు కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో ఆస్పత్రులకు క్యూకడుతున్నారు. 
 
ఇటీవల చైనా నుంచి వచ్చిన చందానగర్‌కు చెందిన 32 ఏళ్ల వ్యక్తితోపాటు, కర్మన్‌ఘాట్‌కు చెందిన వ్యక్తి (26) శనివారం ఆసుపత్రిలో పరీక్షలు చేశారు. వీరిద్దరూ జలుబు, దగ్గుతో బాధపడుతుండటంతో వీరిని ఐసోలేషన్ వార్డుకు తరలించి అబ్జర్వేషన్‌లో ఉంచారు. అలాగే, చైనా నుంచి వచ్చిన గోల్కొండకు చెందిన వ్యక్తి (32)కి కూడా వైద్యులు పరీక్షలు నిర్వహించారు.  
 
ఈనేపథ్యంలో గత నెల 25 నుంచి ఈనెల రెండో తేదీ వరకు 18 మంది అనుమానితులు కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నారు. గత నెల 25 నుంచి 27 మధ్య ఐదుగురు అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా, నలుగురికి ఏమీ లేదని తేలింది. ఒకరిలో మాత్రం స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపించడంతో చికిత్స చేసి పంపారు.
 
ఇక 28వ తేదీన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు కరోనా భయంతో ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. వీరికి కూడా స్వైన్‌ఫ్లూ సోకినట్టు గుర్తించి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందించారు. ఆ తర్వాత మరికొందరు కూడా పరీక్షల కోసం ఆసుపత్రికి తరలివచ్చారు. వీరిలో కొందరి నమూనాలను సేకరించి పూణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. మొత్తంమీద హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది.