మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 6 ఆగస్టు 2020 (17:24 IST)

అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ సర్కారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలను జారీచేసింది. గతంలో కేంద్రం జారీచేసిన జారీ చేసిన అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో కరోనా కట్టడి నిబంధనలు అమలవుతాయని ప్రభుత్వం పేర్కొంది. 
 
ఈ మేరకు మార్గదర్శకాలు వెలువరిస్తూ, ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రంలో అన్ లాక్ ప్రక్రియ అమలవుతుందని, ఆగస్టు 31 వరకూ స్కూళ్లు, కాలేజీలకు అనుమతి ఉండబోదని పేర్కొంది.
 
ఇదే సమయంలో మూవీ థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్, బార్ అండ్ రెస్టారెంట్లు తెరవరాదని ఆదేశించింది. యోగా శిక్షణా కేంద్రాలతో పాటు జిమ్ లు భౌతికదూరం, మాస్క్, శానిటైజర్ నిబంధనలు పాటిస్తూ, కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని వెల్లడించింది.
 
ఆగస్టు 15వ తేదీన నిర్వహిచే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వేడుకలను అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నిర్వహించుకోవాలని సూచించింది. ఇక కంటెయిన్ మెంట్ జోన్లు అమలవుతున్న ప్రాంతాల్లో నెలాఖరు వరకూ లాక్ డౌన్ కొనసాగుతుందని, ఇక్కడ ఆంక్షలు అమలవుతాయని స్పష్టం చేసింది. 

అక్టోబరు 15 కాలేజీల ప్రారంభం 
ఏపీ సీఎం జగన్ ఇవాళ ఉన్నత విద్యపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కళాశాలల రీఓపెనింగ్, కామన్ ఎంట్రన్స్ టెస్టుల నిర్వహణపై జగన్ అధికారులతో చర్చించారు. 
 
ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబరులో కామన్ ఎంట్రన్స్ టెస్టులు నిర్వహించాలని, ఆపై అక్టోబరు 15 నుంచి కాలేజీలు ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
 
మూడేళ్ల, నాలుగేళ్ల కాల వ్యవధి కలిగిన డిగ్రీ కోర్సుల్లో 10 నెలల అప్రెంటిస్ విధానం తప్పనిసరిగా అమలు చేసేలా చూడాలని, అనంతరం మరో ఏడాది పాటు స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి కల్పన కోర్సుల బోధన జరపాలని తెలిపారు. ఆ తర్వాతే అది డిగ్రీ ఆనర్స్‌గా పరిగణించబడుతుందని సీఎం వెల్లడించారు. 
 
అయితే, అడ్మిషన్ సమయంలోనే విద్యార్థి సాధారణ డిగ్రీ కోర్సులో చేరాలనుకుంటున్నాడా? లేక ఆనర్స్ డిగ్రీ కోర్సులో చేరాలనుకుంటున్నాడా? అనే దానిపై దరఖాస్తులో ఆప్షన్ ఉంటుందని వివరించారు.
 
ఏదైనా కాలేజీ అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించవద్దని, కఠినచర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నందున ఖచ్చితంగా గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ పెరగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.