హైదరాబాద్ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్ను అడగండి? సీఎం చంద్రబాబు
హైదరాబాద్ నగరాన్ని ఎవరు డెవలప్ చేశారు? అని గూగుల్ అంకుల్ని అడగండి... ఏఐ సాయంతో సమాధానం వస్తుంది అని విద్యార్థులకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. మద్రాస్ ఐఐటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఐటీ విద్యార్థిని సృజన... సీఎం చంద్రబాబును ప్రశ్నించారు.
తాను తెలంగాణాలోని కరీంనగర్కు చెందిన అమ్మాయనని పరిచయం చేసుకున్న సృజన, ప్రతి ఇంట్లో టెక్నాలజీ డెవలప్ అవ్వాలి, ప్రతి ఒక్కరూ ఏఐ, ఎంఎల్ (మెషీన్ లెర్నింగ్) నేర్చుకోవాలి అన్నారు కదా , ఏఐ తదితర టెక్నాలజీలను మరింత అభివృద్ధి పరిచేందుకు విద్యా వ్యవస్థను ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? అంటువంటి విద్యా సంస్థల్లో ఐఐటీలను ఎలా భాగస్వాములను చేస్తారు? అని ప్రశ్నించింది.
అందుకు చంద్రబాబు బదులిచ్చారు. నువ్వు ఎపుడు పుట్టావమ్మా అని ఆ అమ్మాయిని అడిగారు. ఆ అమ్మాయి 1997లో సర్ అని వెల్లడించింది. అయితే, నువ్వు పుట్టడానికి రెండేళ్ల ముందే సీఎంను అయ్యాను.. నీది ఏ జిల్లా అని అడిగారు. కరీంనగర్ అని ఆ విద్యార్థిని వెల్లడించింది. అక్కడనుంచి చంద్రబాబు తన ప్రసంగం కొనసాగించారు.
నువ్వు హైదరాబాద్ను చూసి ఉంటావు. ఎంత డెవలప్ అయిందో తెలుసు కదా.. ఎవరికైనా సరే ఆలోచనలు అనేవి ఉండాలి. వాటిని ఆచరణలో పెట్టాలి. భవిష్యత్ అంతా క్వాంటమ్ కంప్యూటింగ్ రంగానిదే. ఐటీ గురించి పెద్దగా ఎవరికీ తెలియని రోజుల్లో నేను ఐటీ గురించి మాట్లాడారు. ఇపుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే చాలామందికి తెలియదు.
ప్రస్తుతం భారతదేశంలో 68 శాతం మంది ఏఐని ఉపయోగిస్తున్నారు. అంతెందుకు హైదరాబాద్ను ఎవరు డెవలప్ చేశారు అని గూగుల్ అంకుల్ను అడగండి. ఏఐ సాయంతో సమాధానం వస్తుంది. చాలామంది తెలిసో.. తెలియకో ఏఐని వినియోగిస్తుంటారు. రియల్ డేటా ఉండాలే కానీ ఏదైనా సాధ్యమే అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.