1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అయోధ్య రామాలయం
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 ఆగస్టు 2020 (08:41 IST)

బాలరాముడికి భవ్యమందిరం .. మరికొన్ని గంటల్లో పునాది రాయి

బాలరాముడి భవ్యవమందిర నిర్మాణం జరుగనుంది. ఇందుకోసం బుధవారం మరికొన్ని గంటల్లో పునాదా రాయి పడనుంది. దేశ చరిత్రలో మహోజ్వల ఘట్టంగా భావించే ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని, పునాది రాయి వేయనున్నారు.
 
రఘురాముడి జన్మస్థలమైన అయోధ్యలో కోట్లాది మంది హిందువుల చిరకాల ఆకాంక్ష సాకారానికి తొలి అడుగు పడనుంది. భవ్యమైన రామాలయం నిర్మాణానికి బుధవారం మధ్యాహ్నం శంకుస్థాపన జరుగనుంది. ఈ అపూర్వమైన ఘట్టానికి దేశ ప్రధాని నరేంద్రమోడి హాజరై అంకురార్పణ చేయనున్నారు. 
 
అధ్యాత్మిక నగరి అయోధ్య అతిపెద్ద పండుగకు ముస్తాబైంది. శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం జరుగనుంది. ఇప్పటికే భూమిపూజ కోసం శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్టు అన్ని ఏర్పాట్లు చేసింది. బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 12.45గంటల మధ్య 32 సెకన్ల పాటు జరుగుతుంది. దివ్యధామం అంకుర్పార్పణకు సంబంధించిన సంప్రదాయ కృతువులన్నీ ఇప్పటికే ప్రారంభం కాగా, వేద పండితుల సమక్షంలో ప్రధాని మోడి తొలి ఇటుక వేయనున్నారు. 
 
శంకుస్థాపనలో మొదట నక్షత్రాల్లాంటి ఐదు వెండి ఇటుకలను వేయనున్నారు. అలాగే హరిద్వార్‌ నుంచి తీసుకువచ్చిన గంగా జలాలతో పాటు వేర్వేరు పుణ్య నదుల నుంచి సేకరించిన పవిత్ర జలాలు, మట్టిని వినియోగించనున్నారు. భూమిపూజ సందర్భంగా శిలాఫలకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించి, పారిజాత మొక్కను నాటనున్నారు. అనంతరం శ్రీరామజన్మభూమి మందిర్‌ పేరిట స్టాంపును విడుదల చేస్తారు.