శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 4 మే 2020 (16:25 IST)

కరోనావైరస్ సంక్షోభం తర్వాత తయారీ రంగంలో చైనా స్థానాన్ని భారత్ భర్తీ చేస్తుందా?

కోవిడ్-19 సంక్షోభం కారణంగా ప్రపంచ ఆర్థికవ్యవస్థ ఇప్పుడు మందగమనంలో ఉంది. చైనాలోని తమ తయారీ కేంద్రాలను ఇతర దేశాలకు తరలించాలని వేల సంఖ్యలో విదేశీ సంస్థలు యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారత్ దీన్ని ఓ ‘అవకాశం’గా చూస్తోంది.

 
కరోనావైరస్ సంక్షోభం తర్వాత చైనా వెలుపల అవకాశాల కోసం వెతుకుతున్న అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడుల కోసం సిద్ధంగా ఉండాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. భారత్ తయారీ రంగం కేంద్రంగా మారేందుకు కోవిడ్-19 సంక్షోభం ఓ అవకాశం కావొచ్చని కేంద్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించినట్లు 'మనీకంట్రోల్' వెబ్‌సైట్ పేర్కొంది.

 
చైనాకు ప్రత్యామ్నాయం
కరోనావైరస్ వ్యాప్తి తర్వాత అమెరికా, జపాన్, దక్షిణ కొరియా సహా చాలా దేశాలు చైనా నుంచి తయారీ కేంద్రాలను తరలించే అవకాశాల కోసం చూస్తున్నట్లు 'రిపబ్లిక్ టీవీ' కథనం పేర్కొంది. ఈ సంక్షోభం తర్వాత చైనాకు ప్రత్యామ్నాయ తయారీ రంగ కేంద్రంగా భారత్ అవతరించవచ్చని అంచనా వేసింది.

 
మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాలు, జౌళి తదితర రంగాలకు చెందిన చాలా సంస్థలు భారత్‌లో తయారీ కేంద్రాలు నెలకొల్పే ప్రణాళికల్లో ఉన్నట్లు పేర్కొంది. తయారీరంగ అనుకూల దేశమన్న పేరును కరోనావైరస్ సంక్షోభం తర్వాత చైనా కోల్పోయే అవకాశం ఉందని 'బిజినెస్ స్టాండర్డ్' వెబ్‌సైట్ అభిప్రాయపడింది. వెయ్యికిపైగా విదేశీ సంస్థలు భారత్‌లో తయారీ కేంద్రాలను నెలకొల్పే విషయమై ఇక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయని పేర్కొంది. అయితే, ఆ సంస్థలు చైనాలో ఉన్న తయారీ కేంద్రాలను భారత్‌కు తరలిస్తున్నాయా? లేక కొత్త వాటిని ఇక్కడ నెలకొల్పుతున్నాయా? అన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు.

 
విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు, చైనా స్థానాన్ని భర్తీ చేసేందుకు భారత్‌కు మంచి అవకాశం ఉందని యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్ అధ్యక్షుడు ముకేశ్ ఆఘి 'పీటీఐ' వార్తాసంస్థతో చెప్పారు. ‘‘కరోనావైరస్ సంక్షోభం కారణంగా రాబోయే రోజుల్లో చైనాకు, మిగతా దేశాలకు మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయి. భారత్ సరైన వ్యూహాలు అమలు చేస్తే, చాలా సంస్థలు ఇక్కడికి రావొచ్చు’’ అని ఆయన అన్నారు.

 
కోవిడ్-19 అనంతర అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ‘ప్రపంచపు అతిపెద్ద ఫ్యాక్టరీ’ స్థానాన్ని చైనా నిలుపుకోలేకపోవచ్చని సాయికిరణ్ కన్నన్ అనే విశ్లేషకుడు 'ఇండియా టుడే' వెబ్‌సైట్‌తో చెప్పారు. ‘‘తయారీ రంగానికి అనుకూలమైన వాతావరణం, భారీ మార్కెట్ ఉన్న కారణంగా భారత్ విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా అవతరించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆసియా, ఇతర ప్రాంతాల్లో రాజకీయపరమైన మార్పులు కూడా వస్తాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

 
విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు 'రిపబ్లిక్ టీవీ' పేర్కొంది. కార్పొరేట్ పన్నును ప్రభుత్వం 25.27 శాతానికి తగ్గించిందని, కొత్త తయారీదారులకు దీన్ని ఇంకా 17 శాతానికి తగ్గించిందని తెలిపింది. ‘‘ఉత్పత్తి వ్యయాన్ని చైనా స్థాయికి తేవడం సవాలు. ఆగ్నేయాసియా దేశాలు, భారత్‌కు మధ్య ఉత్పత్తి వ్యయంలో 10 నుంచి 12 శాతం తేడా ఉంది’’ అని పేర్కొంది.

 
కార్మిక చట్టాల ఏకీకరణ, నిబంధనలు తగ్గించడం వంటి చర్యల ద్వారా దేశాన్ని పెట్టుబడులకు ఆకర్షణీయంగా మార్చవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించినట్లు హిందీ దినపత్రిక 'దైనిక్ భాస్కర్' తెలిపింది. తయారీ రంగంలో పెట్టుబడులకు అనుగుణంగా భూ వ్యయం, కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్‌మెంట్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని బీజేపీ అధికార ప్రతినిధి గోపాల్ కృష్ణ అగర్వాల్ వ్యాఖ్యానించినట్లు 'బిజినెస్ టుడే' వెబ్‌సైట్ పేర్కొంది.