ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 మే 2020 (21:51 IST)

వణికిపోతున్న ధారావి - ఒకే రోజు 94 కేసులు :: దేశంలో కరోనా మృతుల శాతమెంత?

దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ వైరస్ విజృంభణ నానాటికీ పెరిగిపోతోంది. ఫలితంగా ఈ ఐదు రాష్ట్రాల్లోనే 50 శాతం కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా, ముంబై, చెన్నై, ఢిల్లీ వంట మెట్రో నగరాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 
 
ఇదిలావుంటే ఆసియాలోనే అతిపెద్ద మురికవాడ ధారావిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఆదివారం ఊహించని రీతిలో ధారావిలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. ఆదివారం ఒక్కరోజే 94 కరోనా పాజిటివ్ కేసులు ధారావిలో నమోదవడంతో అక్కడి ప్రజలు బెంబేలెత్తిపోతున్న పరిస్థితి నెలకొంది. దీంతో ధారావిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 590కి చేరింది. మరణాల సంఖ్య 20కి చేరింది.
 
మరోవైపు, శనివారం కూడా ధారావిలో కరోనా కేసులు ఎక్కువగానే నమోదయ్యాయి. శనివారం 89 పాజిటివ్ కేసులు నమోదయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 1న ధారావిలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదవడం గమనార్హం.
 
ఇదిలావుంటే, ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్‌లో కరోనా మరణాల శాతం తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 39,980 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,301 మంది మరణించారు. 
 
అదే ప్రపంచవ్యాప్తంగా చూస్తే 3.45 మిలియన్ల మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ కాగా, 2.44 లక్షల మంది మరణించారు. ప్రపంచవ్యాప్త కరోనా మరణాల రేటు 7.1 శాతం కాగా, భారత్‌లో మరణాల రేటు 3.2 శాతం మాత్రమేనని ఆయన వివరించారు. 
 
ఇతర దేశాలతో పోల్చితే భారత్ లోనే కరోనా మరణాల సగటు తక్కువ అని కేంద్రం కూడా వెల్లడించింది. ప్రపంచంలోనే అతి తక్కువ సగటు మన దేశంలోనే ఉండడం ఊరడింపు అని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. 
 
కేసులు రెట్టింపు అవుతున్న సమయం కూడా క్రమంగా పెరుగుతోందని, రెండు వారాల కిందట కేసులు రెట్టింపు అవుతున్న సమయం 10.5 రోజులు కాగా, ఇప్పుడది 12 రోజులకు పెరిగిందని వివరించారు.