చెన్నైలో మళ్లీ వర్షం.. కాగ్నిజెంట్ రూ.260 కోట్ల భారీ సాయం
చెన్నై నగరంలో బుధవారం ఉదయం నుంచి మళ్లీ వర్షం కురుస్తోంది. దీంతో నగర వాసులు ఆందోళనకు గురవుతున్నారు. శ్రీలంక నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ఉత్తర తమిళనాడును ఆనుకొని అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతుండటంతో ఈ వర్షాలు పడుతున్నట్టు స్థానిక వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ప్రభావంతో తమిళనాడు, దక్షిణ కేరళ, లక్షద్వీప్లో అక్కడక్కడ బుధవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సాధారణ వాతావరణ పరిస్థితులుంటాయని అంచనా.
మరోవైపు చెన్నై ఇంత వరకూ ఊహించని వర్షం వరదలతో అతాకుతలం అయ్యింది. ఈ ఊహించని విపత్తుకి సినీ తారాలోకం ఇప్పటికే తరలి వచ్చింది. ధన, వస్తు అత్యవసర సామాగ్రిని సాయం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో చెన్నైలో ప్రధాన ఐటీ సంస్థల్లో ఒకటైన కాగ్నిజెంట్ సంస్థ రూ.260 కోట్ల భారీ సాయం ప్రకటించింది. అమెరికాకు చెందిన ఈ సంస్థ చెన్నైలో తమ కార్యకాలాపాలు నిర్వహిస్తున్నది. ఈ సంస్థలో ఇక్కడ 60 వేల మంది ఉద్యోగులున్నారు. చెన్నైలో ఉన్న ప్రస్తుతం పరిస్థితి నుంచి పునరుత్తేజం కావడానికి తాము ఈ సాయం అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
