శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 జనవరి 2021 (10:15 IST)

తెలంగాణలో 379 కరోనా కేసులు.. చలితో ముప్పు

తెలంగాణలో కొత్తగా 379 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,88,789కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. బుధవారం కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,553కి చేరింది.
 
కరోనాబారి నుంచి బుధవారం 305 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,82,177కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 5,053 ఉండగా వీరిలో 2,776 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 71 కరోనా కేసులు నమోదయ్యాయి.
 
ఇకపోతే.. తెలంగాణలో చలితో ముప్పు పొంచి వుంది. రాబోయే మూడు నాలుగు రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌, నల్లగొండ, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జోగులాంబ గద్వాల, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. 
 
కొమరిన్ ఏరియా నుంచి ఉత్తర తమిళనాడు వరకు గల్ఫ్ ఆఫ్ మన్నార్ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. ద్రోణితో తూర్పు దిశ నుంచి వేగంగా గాలులు వీస్తున్నాయి. 
 
బంగాళాఖాతంలోని తేమ దక్షిణ కోస్తా నుంచి తెలంగాణ మీదుగా రావడంతో ఆకాశం మేఘావృతమై గురువారం పలు చోట్ల ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు. బుధవారం అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 14 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.