1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (11:30 IST)

నిజాముద్దీన్ మర్కజ్‌తో కరోనా కల్లోలం, 24 గంటల్లో 547 కేసులు

ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ సమావేశం దేశంలో కరోనా కేసులు రాకెట్ వేగంతో పెరగడానికి ప్రధాన కారణంగా నిలిచింది. కేవలం 24 గంటల్లోనే 547 కేసులు నమోదయ్యాయంటే దాని తీవ్రత ఏ స్థాయిలో వున్నదో అర్థం చేసుకోవచ్చు. దక్షిణ కొరియాలో కరోనా బాధిత మహిళ సృష్టించిన కల్లోలం మాదిరిగా నిజాముద్దీన్ మర్కజ్ భారతదేశాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.
 
ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో మార్చి 1 నుంచి 15 వరకు నిర్వహించిన మతపరమైన కార్యక్రమాల్లో విదేశీయులు సహా పలు రాష్ట్రాల నుంచి వేలాది మంది పాల్గొనడంతో అక్కడ వందలమందికి కరోనా వైరస్ సోకింది. తొలుత ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ పసిగట్టారు. కరీంనగర్ వాసి, నిజాముద్దీన్ నుంచి రావడం, అతడికి కరోనా వైరస్ సోకడంతో వెంటనే కేంద్రాన్ని అప్రమత్తం చేసింది తెలంగాణ ప్రభుత్వం. 
 
కేంద్రం అటువైపు దృష్టి సారించేలోపే జరగాల్సినదంతా జరిగిపోయింది. కేవలం 24 గంటల వ్యవధిలో దేశంలో 547 కేసులు నమోదయ్యాయి. ప్రధాని విధించిన లాక్‌డౌన్‌ స్ఫూర్తిని తూట్లు పొడిచినట్లు ఈ ఘటన స్పష్టం చేసింది. ఫలితంగా దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 2,500 దాటిపోగా, గత 24 గంటల్లోనే 547 కేసుల నమోదయ్యాయి.
 
నిజాముద్దీన్ ప్రభావం ఎక్కువగా తమిళనాడులో కనబడుతోంది. ఆ రాష్ట్రంలో మూడు రోజుల్లోనే 240 వరకు కేసులు నిర్ధారణ కాగా వారిలో ఎక్కువమంది ఢిల్లీ నిజాముద్దీన్‌ నుంచి వచ్చినవారినని అధికారులు చెపుతున్నారు.