1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 జులై 2022 (09:40 IST)

ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిన భారత్... లార్డ్స్‌లో 39 యేళ్ల రికార్డు మాయం

team india
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు గురువారం జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 246 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత 247 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 146 పరుగులకే కుప్పకూలింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో నిలిచాయి. 
 
సిరీస్ ఫలితాన్ని తేల్చే ఆఖరి వన్డే మ్యాచ్‌ ఆదివారం జరగనుంది. రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ ఓడినప్పటికీ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ (4/47) ఆకట్టుకుంది. ఈ క్రమంలో 39 ఏళ్ల కిందట రికార్డును చాహల్‌ బద్దలు కొట్టాడు. 
 
1983 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ లార్డ్స్‌ స్టేడియంలో జరిగింది. ఇందులో విండీస్‌పై భారత్ చిరస్మరణీయ విజయం సాధించింది. ఫలితంగా భారత్‌కు తొలి కప్ అందిచిన ఘనత కెప్టెన్ కపిల్‌ దేవ్‌కు దక్కింది. 
 
అయితే విండీస్‌ నడ్డివిరచడంలో మొహిందర్‌ అమర్‌నాథ్ కీలక పాత్రపోషించాడు. అద్భుతమైన బౌలింగ్‌ స్పెల్‌ 3/12తో అదరగొట్టాడు. ఇదే ఇప్పటి వరకు లార్డ్స్‌లో ఓ భారత బౌలర్‌ అత్యుత్తమ ప్రదర్శన. అయితే తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చాహల్ (4/47) ఆ రికార్డును అధిగమించాడు. 
 
మరోవైపు, వన్డే క్రికెట్‌లో ఇంగ్లాండ్‌ తరపున అత్యుత్తమ ప్రదర్శన చేసిన బౌలర్‌గా టోప్లే (6/24) నిలిచాడు. లార్డ్స్‌ మైదానంలో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కూడా టోప్లేదే కావడం విశేషం. ఇంతకుముందు షాహీన్‌ అఫ్రిది (6/35) పేరిట రికార్డు ఉండేది.
 
మూడేళ్ల కిందట ఇంగ్లాండ్‌ తొలిసారి వరల్డ్‌ కప్‌ను నెగ్గిన రోజు (జులై 14) జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడం విశేషం. ఇప్పటివరకు లార్డ్స్‌లో తొమ్మిది వన్డేలు ఆడిన భారత్‌.. నాలుగు మ్యాచుల్లో  విజయం సాధించి, మరో నాలుగు మ్యాచుల్లో ఓటమిపాలైంది. ఒక వన్డేలో ఫలితం తేలలేదు. లార్డ్స్‌ మైదానంలో భారత్‌ తన అత్యల్ప స్కోరు (132/3).. మరోసారి చెత్త రికార్డను నమోదు చేసే ప్రమాదం నుంచి తప్పించుకొంది.