మంగళవారం, 14 ఏప్రియల్ 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 ఏప్రియల్ 2026 (12:45 IST)

సైకో వీరంగం.. హతమార్చిన గ్రామస్థులు...

murder
శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ సైకోను గ్రామస్థులు మట్టుబెట్టారు. సైకోలా ప్రవర్తిస్తూ కొడవలితో దాడికి పాల్పడుతున్న వ్యక్తిపై దాడి చేయగా గాయాలపాలై మృతి చెందాడు. శ్రీసత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలం గాడ్రాళ్లపల్లి ఢిల్లీలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బావిరెడ్డి (48) 2007లో గ్రామంలో జరిగిన ఓ హత్య కేసులో ఆరేళ్లు జైళు శిక్ష అనుభవించి వచ్చాడు. అప్పటి నుంచి అతని మానసిక స్థితి బాగోలేదని గ్రామస్థులు అంటున్నారు. పెళ్లయిన నెలకే భార్య వదిలేసి పుట్టింటికి వెళ్లిపోవడంతో ఒంటరిగానే ఉండేవాడు. 
 
కాగా, బావిరెడ్డి ఇంటిపక్కన ఇద్దరు వ్యక్తులు కార్లు ఆపి ఉంచగా శనివారం అర్థరాత్రి సమయంలో పెద్ద బావిరెడ్డి పెద్ద బండరాళ్లు వేసి అద్దాలు, లోపల భాగాలను ధ్వంసం చేశాడు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గ్రామానికి చేరుకోగా బావిరెడ్డి సమీప పొలాల్లోకి పారిపోయాడు. పోలీసులు గాలించినా అతడు దొరకలేదు. దీంతో వారు వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన నేసే నారాయణప్ప పశువుల మేత కోసం కొడవలి తీసుకుని, పొలం వద్దకు బయల్దేరాడు. 
 
పొలంలో దాగివున్న బావిరెడ్డి. నారాయణప్ప చేతిలో ఉన్న కొడవలిని లాక్కుని, విచక్షణారహితంగా దాడిచేశాడు. దీంతో అతడి చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నారాయణప్ప అరుచుకుంటూ ఊర్లోకి పరుగెత్తుకొచ్చాడు. బావిరెడ్డి కూడా కొడవలితో అతడిని వెంబడిస్తూ ఊర్లోకి వచ్చి, మళ్లీ దాడి చేశాడు. దీంతో గ్రామస్థులు బావిరెడ్డిని తాళ్లతో బంధించే క్రమంలో పలువురు దాడి చేశారు. తోపులాటలో కిందపడిన బావిరెడ్డి ముఖంపై తీవ్ర గాయాలై చనిపోయాడు. దాడికి పాల్పడిన వారు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.