1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: గురువారం, 28 అక్టోబరు 2021 (15:26 IST)

బద్వేలు ఉప ఎన్నికల్లో బిజెపి ఘనవిజయం ఖాయమట, ఎలా సాధ్యమో చూడండి

ఇప్పుడు రాష్ట్రంలో అంతా బద్వేలు ఉప ఎన్నికపైనే చర్చ జరుగుతోంది. అధికార పార్టీ నేతలు మాత్రం లక్ష ఓట్ల మెజారిటీ ఖాయమని చెప్పుకుంటుంటే బిజెపి మాత్రం గెలుపు తమదేనని.. చాపకింద నీరులా జనం బిజెపికి ఓట్లేసి గెలిపిస్తారన్న ధీమాలో ఉన్నారు. ఎవరి ధీమా వారిది కానీ ఇక్కడ ప్రధానంగా చర్చకు వచ్చేది బిజెపి అభ్యర్థి సురేష్ గురించే. ఇప్పుడితనే హాట్ టాపిక్‌గా మారుతున్నాడు.
 
ఆస్తి, హంగు, ఆర్భాటం లేకుండా రాజకీయాల్లోకి రావడం ఈరోజుల్లో సాధ్యమా..? సాధారణంగా సాధ్యం కాదనే సమాధానమే ప్రజల నుంచి వస్తుంది. కానీ బద్వేల్ ఉప ఎన్నికల పోటీలో ఉన్న బిజెపి అభ్యర్థి పనతల సురేష్ నేపథ్యం చూస్తే పేదలకు రాజకీయాల్లో స్థానం ఉంటుందని అర్థమవుతుందన్న అభిప్రాయాన్ని బిజెపి నేతలు వ్యక్తం చేస్తున్నారు. 
 
ప్రజల కోసం పనిచేసే నాయకుడిని బిజెపి టిక్కెట్ ఇవ్వడం.. ఎన్నికల ఖర్చునూ పార్టీనే భరించడం, రాజకీయాల్లో ధనబలం, కండబలానికే కాకుండా అంకితభావంతో ప్రజలకు సేవ చేయాలనే గట్టి సంకల్పం ఉన్న అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనడానికి సురేష్ ఉదాహరణ అంటూ బిజెపి చెబుతోంది. 
 
బద్వేలు బిజెపి అభ్యర్థి సురేష్‌కు పాన్ కార్డు ఉంది కానీ ఇంతవరకు ఐటీ రిటర్న్ లేదని.. చిన్నాచితకా వ్యాపారం చేసుకునే ఒక సాధారణ వ్యక్తి అంటూ బిజెపి ఆధారాలను చూపిస్తోంది. విద్యార్థి దశ నుంచే ప్రజల కోసం ఉద్యమాల చేసి పోలీసు స్టేషన్‌కు వెళ్ళి లాఠీ దెబ్బలు తిన్న వ్యక్తి సురేష్ అంటూ బిజెపి చెబుతోంది.
 
ఉన్నత విద్యను అభ్యసించిన సురేష్ ఈసారి ఖచ్చితంగా గెలుస్తాడు. బిజెపి అగ్రనాయకులందరూ రంగంలోకి దిగి బిజెపి అభివృద్థిని ప్రజలకు వివరించారని చెబుతున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. ప్రస్తుతం ప్రచారం ముగిసింది. రేపు ఎన్నికలు జరుగనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో బిజెపి సైలెంట్ ప్రచారం వైసిపి నేతల్లో ఆందోళనను కలిగిస్తోంది.