1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 17 ఏప్రియల్ 2024 (12:23 IST)

బుల్లెట్ రైలులోకి పాము ఎలా వచ్చింది... ప్రయాణం 17 నిమిషాలు ఆలస్యం!!

bullet train
ప్రపంచంలో జపాన్ బుల్లెట్ రైళ్లకు ప్రత్యేక పేరుతో పాటు గుర్తింపు ఉంది. వేగానికి మారు పేరుగా ఈ రైళ్లను చెబుతారు. అలాంటి రైలులో పాము చేరిపోయింది. ఈ కారణంగా ఆ రైలు ప్రయాణం 17 నిమిషాల పాటు ఆలస్యమైంది. సాధారణంగా పాము వల్ల రైలు ప్రయాణం ఆలస్యం కావడం అనేది చాలా చాలా అరుదు. కానీ, ఇలాంటి అత్యంత అరుదైన ఘటన ఇపుడు జపాన్ నగరంలో చోటుచేసుకుంది. 
 
రైలులో ఓ 40 సెంటీమీటర్ల చిన్న పాము కదులుతుండటాన్ని ఓ ప్రయాణికుడు గుర్తించాడు. ఆ వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం చేరవేశాడు. దీంతో బుల్లెట్ రైలు 17 నిమిషాల పాటు నిలిపివేశారు. ఆ బోగీలోని ప్రయాణికులను మరో బోగీలోకి తరలించి గమ్యస్థానానికి చేర్చారు. అయితే, ఆ బుల్లెట్ రైలులోకి ఆ పాము ఎలా వచ్చిందన్నది తెలియలేదు. అలాగే, ఆ పాము కూడా విషపూరితమా కాదా అన్నది కూడా తెలియరాలేదు. 
 
ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ప్రయాణికులెవ్వరూ గాయపడలేదని జపాన్ సెంట్రల్ రైల్వే కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కాగా, జపాన్ రైల్వేస్ 1964లో బుల్లెట్ రైలు సేవలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క ప్రమాదం లేదా మరణం సంభవించలేదు. ఈ రైళ్లు గంటకు 285 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతాయి. ఈ రైళ్ల సగటు ఆలస్య వ్యవధి కేవలం 0.2 నిమిషాలే కావడం గమనార్హం.