శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 మార్చి 2021 (06:22 IST)

కోరలు చాస్తున్న కరోనా.. కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం

దేశంలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. దీంతో కేంద్రం కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేస్తోంది. ఈ నూతన మార్గదర్శకాలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఏప్రిల్‌ 30 వరకు అమల్లో ఉంటాయి. 
 
ముఖ్యంగా, కరోనా కట్టడికి కొత్త మార్గదర్శకాలను విధిగా పాటించాలని కోరింది. కరోనా నిర్ధారణ పరీక్షలు, బాధితుల గుర్తింపు, చికిత్సపై దృష్టి సారించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 
 
కొత్త మార్గదర్శకాలివే..
 
* రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు పెంచాలి. పాజిటివ్‌ వచ్చిన వారిని క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందించాలి. ఆ తర్వాత వారు ఎవరెవరిని కలిశారో గుర్తించాలి.
 
* పాజిటివ్‌ కేసులను బట్టి కంటైన్మెంట్‌ జోన్‌లను గుర్తించాలి. ఈ వివరాలను ఎప్పటికప్పుడు వెబ్‌సైట్లో పొందుపర్చాలి. కంటైన్మెంట్‌ జోన్‌లలో ఇంటింటికి తిరిగి పరీక్షలు చేయాలి.
 
* బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, రద్దీప్రాంతాల్లో ప్రజలు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలి. మాస్క్‌లు ధరించడం, సామాజికదూరం పాటించడం వంటి నిబంధనలను ఉల్లంఘించకుండా చూడాలి. ఉల్లంఘించిన వారిపై అవసరమైతే జరిమానా వంటి చర్యలు కూడా తీసుకోవచ్చు.
 
* స్థానిక పరిస్థితులను బట్టి కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆంక్షలు విధించవచ్చు.
 
* రాష్ట్రాల మధ్య, రాష్ట్రం లోపల రాకపోకలపై ఎలాంటి నిషేధం ఉండదు. వ్యక్తులు, సరకు రవాణా కోసం రాష్ట్రాల మధ్య ఎలాంటి అనుమతులు అవసరం లేదు.
 
* కంటైన్మెంట్‌ జోన్‌ వెలుపల అన్ని కార్యకలాపాలకు అనుమతి ఉంది. 
 
* ప్రయాణికుల రైళ్లు, విమానాలు, మెట్రో రైళ్లు, స్కూళ్లు, విద్యాసంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్లు, పార్కులు, జిమ్‌ సెంటర్లు తదితర వాటిల్లో మాత్రం నిర్దేశిత ప్రమాణాలు(ఎస్‌ఓపీలు) అమల్లో ఉంటాయి.
 
* ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ ప్రక్రియను భారత్‌ ప్రారంభించింది. అయితే ఇంకా కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో టీకా పంపిణీ నెమ్మదిగా సాగుతోంది. 
 
* ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్‌ వ్యాప్తి చైన్‌ను విడగొట్టాలంటే టీకానే ఆధారం. అందువల్ల రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వ్యాక్సినేషన్‌పై మరింత దృష్టిపెట్టాలి. అర్హులైన వారందరూ టీకా వేయించుకునేలా చూడాలి.