మమత బెనర్జీకి మరిన్ని కష్టాలు.. కోల్కతాలో కేసు నమోదు
గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అధికారాన్ని కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కష్టాలు చుట్టుముట్టాయి. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎంసీకి చెందిన ప్రజాప్రతినిధులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆ పార్టీకి చెందిన 28 మంది ఎంపీల్లో 20 మంది ఎంపీలు వేరు కుంపటి పెట్టారు. అలాగే, పలువురు ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు జెండా ఎగురవేశారు.
ఈ నేపథ్యంలో మమతా బెనర్జీపై కోల్కతాలో ఎఫ్ఐఆర్ నమోదైంది. దక్షిణ కోల్కతాలోని నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్లో ఓ స్థానికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేశారు. గత మార్చిలో ధర్మతలలో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో మమత చేసిన వ్యాఖ్యలు మతపరమైన విభేదాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయన ఫిర్యాదుదారుడు ఆరోపించాడు. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు సమాజంలో భయాందోళనలు, వైషమ్యాలు పెంచేలా ఉన్నాయని ఫిర్యాదు పేర్కొన్నారు. మే నెలలో ఫిర్యాదు అందంగా, తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదిలావుండగా, ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు కూడా టీఎంసీకి సవాళ్లను తెచ్చిపెడుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీలో అంతర్గతంగా అసంతృప్తి పెరుగుతోందనే చర్చ సాగుతోంది. కొందరు నాయకులు పార్టీకి దూరమవుతుండగా, మరికొందరు తమ రాజకీయ భవిష్యత్పై కొత్త నిర్ణయాలు తీసుకునే దశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం.
