1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2023 (10:53 IST)

సంపద సృష్టించే సంక్షేమానికి ఖర్చు చేయాలి : ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు

prashanth kishore
ఏ రాష్ట్ర ప్రభుత్వమైన సంపద సృష్టించి, అందులో వచ్చే ఆదాయంలో కొంతమొత్తానికి సంక్షేమానికి ఖర్చు చేయాలని జాతీయ ఎన్నికల వ్యూహకర్త, వైకాపా వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. సంక్షేమం అవసరమేకానీ.... సంపద సృష్టించి, దానిలో నుంచే పంపిణీ చేయాలని ప్రభుత్వాలకు సూచించారు. అనేక పార్టీలకు రాజకీయ వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిశోర్ ఇటీవల బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో రంగ ప్రవేశం చేశారు. 
 
తన రాజకీయ పర్యటనల్లో భాగంగా, ఏపీలో అభివృద్ధిని మూలకు పడేసి, సంక్షేమం పేరుతో జరుగుతున్న హంగామాపై అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. 'సంక్షేమ కార్యక్రమాలు ఉండాల్సిందే. అవి లేకుంటే మనం సమాజానికి అన్యాయం చేసినట్లవుతుంది. అయితే... సంపద సృష్టించి అందులో నుంచి కొంత పంపిణీ చేయాలి. సమాజంలో సంపద పెరిగే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలి. అప్పుడే మన భావితరాలకు మేలు జరుగుతుంది' అని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. 
 
మరి... జగన్ సర్కారుకు ఆయన ఈ మాట చెప్పారో లేదో తెలియదు. ప్రశాంత్ కిశోర్ చెబుతున్న 'సంపద పెరిగే వాతావరణం' జగన్ హయాంలో అంతరించి పోయింది. పాత పథకాలకే పేర్లు మార్చి, అమలు తీరు మార్చి బటన్ నొక్కడమొ క్కటే మిగిలింది. అభివృద్ధి లేదు. అప్పులు పుట్టకుంటే 'బటన్' పని చేయదు. 'అమ్మ ఒడి' సహా పలు కీలక పథకాలను మద్యం ఆదాయంతోనే అమలు చేస్తున్నట్లు ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. 'సంక్షేమం' పేరుతో అనుచితమైన ఉచితాలకు తెరలేపింది ప్రశాంత్ కిశోర్ సలహాల మేరకే. ఎలాగైనా అధికారంలోకి రావాలని, రాష్ట్రం ఏమైపోయినా ఫర్వాలేదని, ఓట్లు రాలడమే ముఖ్యమని ప్రశాంత్ కిశోర్ నాడు చెప్పారు.