బీటెక్ విద్యార్థి ప్రాణాలు తీసిన బెట్టింగ్ యాప్స్!
తెలంగాణా రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్కు ఓ బీటెక్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. బెట్టింగ్ యాప్స్ కారణంగా అప్పులపాలై బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హుజారాబాద్ గ్రామీణంలో నెలకొంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం శ్రీరాములపల్లికి చెందిన రాజయ్య, లక్ష్మీ అనే దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజయ్య జమ్మికుంటలో టైలరింగ్ పనులు చేస్తుంటే, పెద్ద కుమారుడు అభినవ్ హైదరాబాద్ నగరంలో టెక్కీగా పనిచేస్తున్నాడు. చిన్నకుమారుడు అఖిలేష్ బీటెక్ పరీక్షలు రాశాడు. వాటిలో కొన్ని పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఇంటి వద్దే ఉంటూ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు.
ఈ క్రమంలో గురువారం ఉదయం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీన్ని గమనించిన తల్లిదండ్రులు గ్రామస్థుల సాయంతో తలుపులు పగులగొట్టి అఖిలేష్ను బయటకు తీసుకొచ్చారు. అయితే, అతను అప్పటికే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తన సోదరుడు మృతికి బెట్టింగ్ యాప్స్, రుణ యాప్స్ కారణమని మృతుడు అన్న అభినవ్ ఆరోపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.