పాలకులం కాదు.. సేవకులకు మాత్రమే : సీఎం రేవంత్ రెడ్డి
తాము ప్రభుత్వ పాలకులం కాదని ప్రజా సేవకులమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలకు సేవ చేయడానికే వచ్చామని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలోని బంజార్ భవన్లో నిర్వహించిన సంత్ శ్రీ సేవాలాల్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, రాష్ట్ర ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు అహర్నిశలు కృషిచేస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని తండాలకు బీటీ రోడ్లు వేయాలని ఆదేశాలు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి తండాలోని పాఠశాల భవనాలకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. తండాలకు సోలార్ ప్లాంట్ల ద్వారా కరెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందన్నారు. ప్రభుత్వం వద్ద భూములు లేవని.. సంక్షేమంతో పాటు విద్య ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. చదువుతో కీలక పదవులు వస్తాయన్నారు.
'నేనెప్పుడూ పాలకుడిగా ప్రవర్తించలేదు. ఎస్సీ వర్గీకరణ చేసి ఆయా వర్గాలకు మేలు చేశాం. వివిధ వర్గాలను పరిపాలనలో భాగస్వాములను చేయాలనే ఆలోచన నాది. రాష్ట్రంలో ఎస్సీలు 17 శాతం ఉంటే.. మా ప్రభుత్వంలో 30 శాతం ఉన్నారు. దళితులకు స్పీకర్, మంత్రి పదవులు ఇచ్చాం. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిపై విపక్ష నేతలు ప్రజలను నిందిస్తున్నారు. 'నేనే రాజు.. నేనే మంత్రి' వ్యాఖ్యలను వక్రీకరించారు. పురపాలక మంత్రిని కూడా నేనే కాబట్టి గెలుపు.. ఓటమి.. అన్నింటికీ బాధ్యత తీసుకుంటానని చెప్పా. ఈ ఎన్నికల్లో ప్రతి ఫలితం నా పనితనానికి గీటురాయి' అని రేవంత్ రెడ్డి అన్నారు.