1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. TGSRTC launches 35 electric luxury buses in Karimnagar

కరీంనగర్‌లో 35 ఎలక్ట్రిక్ బస్సులు.. 3,035 ఉద్యోగ ఖాళీల కోసం..?

tsrtc
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్సార్టీసీ) కరీంనగర్‌లో 35 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించింది. హైదరాబాద్ తర్వాత లగ్జరీ బస్సులను కలిగి ఉన్న రెండవ జిల్లాగా నిలిచింది. కరీంనగర్-హైదరాబాద్ (జేబీఎస్) రూట్‌లో నడిచే బస్సులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. 
 
ప్రారంభించిన అనంతరం మంత్రి కొత్త బస్సుల్లోని ఒకదానిలో టీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సంజయ్‌కుమార్‌, కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు, కరీంనగర్‌ కలెక్టర్‌ పమేలా సత్పతి, మున్సిపల్‌ కమిషనర్‌ చాహత్‌బాజ్‌ పాయ్‌తో కలిసి ప్రయాణించారు.
 
ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ ప్రస్తుతం 35 బస్సులు అందుబాటులో ఉన్నాయని, అదనంగా మరో 39 ఎలక్ట్రిక్ బస్సులను త్వరలో మంజూరు చేస్తామని ప్రకటించారు. నిజామాబాద్‌కు 67, వరంగల్‌కు 86, సూర్యాపేటకు 52, నల్గొండకు 65, హైదరాబాద్‌కు 74 ఎలక్ట్రిక్ బస్సులను ప్లాన్ చేయడంతో ఇతర జిల్లాలు కూడా ప్రయోజనం పొందుతాయి. 
 
మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకం వల్ల బస్సులకు డిమాండ్ పెరిగిందని ప్రభాకర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్‌లతో కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు టిఎస్‌ఆర్‌టిసి యోచిస్తోందని, ఇప్పటికే 3,035 ఉద్యోగ ఖాళీల కోసం రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. 
 
ఈ ఆధునిక బస్సులు ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచుతాయని, వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి వివిధ జిల్లాల్లో 500 ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ లక్ష్యంగా పెట్టుకుందని సజ్జనార్ తెలిపారు. కరీంనగర్-హైదరాబాద్ మధ్య ఎలక్ట్రిక్ బస్సులు నాన్‌స్టాప్‌గా నడపనున్నట్లు ఆయన తెలిపారు. గడచిన 300 రోజుల్లో మహిళలకు 92 కోట్ల జీరో టిక్కెట్లను కార్పొరేషన్ జారీ చేసిందని, ఫలితంగా రూ.3,123 కోట్లు ఆదా అయ్యాయని సజ్జనార్ వెల్లడించారు. ఈ పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేయడంలో ఆర్టీసీ ఉద్యోగులు కృషి చేస్తున్నారని కొనియాడారు.
తర్వాతి కథనం
మైసూరులో మరో రేవ్‌పార్టీ- 50 మందికిపైగా అరెస్ట్- అపస్మారకస్థితిలో యువత