శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 సెప్టెంబరు 2020 (09:22 IST)

కటకటాల్లోకి అవినీతి తిమింగలం - ఏసీపీ నర్సింహా రెడ్డి అరెస్టు

ఆదాయానికి మించి ఆస్తులు పోగు చేసిన కేసులో మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డిని అవినీతి నిరోధక శాఖ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను గురువారం ఏసీబీ కోర్టులో హాజరుపరిచనున్నారు. ఈయన ఆస్తులు ప్రాథమికంగా 70 కోట్ల రూపాయల మేరకు ఉన్నట్టు గుర్తించారు. 
 
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో విధుల నిర్వహించిన నర్సింహారెడ్డి.. పలు భూసెటిల్మెంట్లు చేసి అక్రమార్జనకు పాల్పడినట్టు ఏసీబీకి పక్కా సమాచారం వచ్చింది. దీంతో బుధవారం ఆయన నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్ళలో ఏక కాలంలో 25 చోట్ల ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీలు ఉమ్మడి వరంగల్, కరీంనగర్, అనతంపురం, హైదరాబాద్ జిల్లాల్లో జరిగాయి. 
 
ఈ సందర్భంగా మొత్తం రూ.70 కోట్ల ఆస్తులును ప్రాథమికంగా గుర్తించారు. హైదరాబాద్‌లో 3 ఇళ్లు, 5 ఇంటి స్థలాలు ఉన్నట్టు కనుగొన్నారు. నర్సింహారెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు ఆయనను నాంపల్లిలోని తమ కార్యాలయానికి తరలించారు. గురువారం ఏసీబీ కోర్టులో ఆయనను ప్రవేశపెట్టనున్నట్టు ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి తెలిపారు.