1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 27 జూన్ 2020 (08:41 IST)

హైదరాబాద్‌లో హోల్‌సేల్ మార్కెట్‌ల మూత

కరోనా మహమ్మారి అంతకంతకూ పెరుగుతుండటంతో తమను తాము రక్షించుకునేందుకు హైదరాబాద్‌ వ్యాపారులు చర్యలు చేపట్టారు.

హైదరాబాద్‌‌ మార్కెట్లు, బజార్ల నుండి తెలుగు రాష్ట్రాలకే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా నిత్యావసర సరుకులు ఎగుమతి అవుతుంటాయి. దీంతో బేగం బజార్‌లో రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇక్కడ సుమారు 700 వరకు హోల్‌సేల్‌ కిరాణా దుకాణాలున్నాయి.
 
పెద్ద సంఖ్యలో చిన్నాచితక వ్యాపారులు వస్తుంటారు. వినియోగదారుల రద్దీని చాలా వరకు నియంత్రించేందుకు స్వచ్చందంగా మార్కెట్లకు లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఈ నెల 28 నుంచి జూలై ఐదు వరకు బేగంబజార్‌ను పూర్తి స్థాయిలో మూసివేస్తున్నారు.

బేగంబజార్‌లోని పన్నెండు మంది వ్యాపారులకు కరోనా రావడం, ఇందులో ముగ్గురు మృతి చెందడంతో వ్యాపారులు హడలిపోతున్నారు. దీంతో ఈ నెల 28 నుంచి బేగంజబార్‌ మార్కెట్‌ పరిధిలోకి వచ్చే కిషన్‌గంజ్, మహారాజ్‌గంజ్‌, బర్తన్‌ బజార్‌ తదితర మార్కెట్లను మూసివేస్తున్నారు.

ఎవరైనా దుకాణాలను తెరిచి వ్యాపారం చేస్తే వారి సభ్యత్వాన్ని రద్దు చేస్తామని ప్రకటించింది హైదరాబాద్‌ కిరాణా మర్చంట్‌ అసోసియేషన్‌. ఇప్పటికే సికింద్రాబాద్‌లోని ప్రముఖ బెనారస్ పట్టు చీరల మార్కెట్‌ను బంద్‌ చేశారు.

మరో వైపు లాడ్‌ బజార్‌ను వారం రోజుల పాటు మూసివేస్తున్నట్టు లాడ్‌ బజార్‌ ట్రేడ్ యూనియన్‌ వ్యాపారులు ప్రకటించారు. జూలై ఐదు వరకు సికింద్రాబాద్‌ జనరల్ బజార్‌, సూర్యా టవర్స్‌, ప్యారడైజ్‌ మూసివేయనున్నట్లు తెలిపారు.