శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (08:31 IST)

తెలంగాణపై ఏపీ మద్యం వ్యాపారుల కన్ను

ఏపీ మద్యం వ్యాపారుల కన్ను తెలంగాణపై పడింది. దశలవారీగా లిక్కర్ బ్యాన్ చేస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు  ఏటా 20 శాతం చొప్పున వైన్ షాపులు, బార్లు మూసివేయాలని నిర్ణయించింది.

దీంతో సిండికేట్ గా మారిన  ఏపీ లైసెన్స్డ్ మద్యం వ్యాపారులు తెలంగాణవైపు చూస్తున్నారు. ఏపీతో పోలిస్తే టెండర్ ధరలు కాస్త తక్కువగా ఉండటంతో పాగా వేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నెల 30వ తేదీతో ప్రస్తుతం నడుస్తున్న మద్యం దుకాణాల గడువు ముగుస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం కొత్త లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ ఇచ్చింది.

త్వరలో టెండర్ల ప్రక్రియకు చర్యలు తీసుకొంటోంది. సాధారణంగా మద్యం దుకాణాల టెండర్లు అంటేనే పోటాపోటీగా దరఖాస్తులు వస్తాయి. పాత వ్యాపారులతోపాటు ఎప్పటికప్పుడు కొత్తవాళ్లు వేలంలో పాల్గొంటారు. ఒక ఏరియా వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి టెండర్లు వేస్తారు. తర్వాత గడువు కొద్దీ వ్యాపారం చేసుకుంటారు.

ఈ సిండికేట్లోకి ఏపీ వ్యాపారులు చేరుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, పాలమూరు జిల్లాల్లోని మద్యం వ్యాపారులతో ఏపీ సిండికేట్ చర్చలు మొదలైనట్లు సమాచారం. ఈ సారి మద్యం టెండర్లలో దరఖాస్తుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
 
కృష్ణా, గోదావరి జిల్లా వాళ్లే ఎక్కువ
తెలంగాణ లిక్కర్ వ్యాపారులతో సిండికేట్ గా ఏర్పడ్డవాళ్లలో కృష్ణా, గోదావరి జిల్లాల వాళ్లే ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. పాలమూరు జిల్లాలో స్థానిక వ్యాపారులను కర్నూలు, అనంతపురం జిల్లాల మద్యం వ్యాపారులు సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో ఈ ఏడాది కొనసాగించే 80 శాతం వైన్ షాపులను కూడా ప్రభుత్వం నిర్వహించేందుకు ఉత్తర్వులు ఇవ్వడంతో మద్యం వ్యాపారులకు పని లేకుండా పోయింది. దీంతో ఆంధ్రా బోర్డర్ జిల్లాల్లో ఉన్న స్థానిక మద్యం వ్యాపారులతో కలిసి టెండర్లలో పాల్గొనేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇప్పటికే తెలంగాణలో ఉన్న మద్యం వ్యాపారులకు కమీషన్ ఆశచూపి ఏపీ సిండికేట్ పాగా వేస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో టెండర్ల దాఖలు భాగస్వామ్య పద్ధతిలో చేసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయి.