శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (07:58 IST)

ఏపీలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టాం : అజేయ కల్లాం

గ్రామ, వార్డు స్థాయిలో శాశ్వతంగా సచివాలయాల ఏర్పాటు అమలు చేయాలన్న ఉద్దేశంతో ముందుకు అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయకల్లాం అన్నారు.

వెలగపూడి సచివాలయంలోని ప్రచార విభాగంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి విలేఖర్లతో మాట్లాడుతూ,  తక్కువ సమయంలో ఒకేసారి లక్షా 34 వేల ఉదోగాలు భర్తీ చేయడం ఒక రికార్డు అన్నారు. పూర్తి పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు.

నిరుద్యోగ సమస్యను తగ్గించడంతో పాటు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అర్హులైన పేదలకు అందించాలని, ప్రభుత్వ సేవల్లో జాప్యం జరగరాదనే సదుద్దేశంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని మరోసారి గుర్తుచేశారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన స్వేచ్ఛ.. రాజకీయ జోక్యం లేకుండా చర్యలు తీసుకోవడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. రాజకీయ జోక్యం లేకుంటే అధికారుల పనితీరు అద్భుతంగా ఉంటుందనడానికి ఈ ఉద్యోగ నియామక ప్రక్రియే నిదర్శనమన్నారు.   పరీక్షల నిర్వహణలో ఎవరూ కలగజేసుకోకుండా పకడ్భంధీగా నిర్వహించామని తెలిపారు.

అందరూ హర్షించే విధంగా పరీక్షలను నిర్వహించడం అద్భుతమన్నారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేది, పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ విజయ్ కుమార్, అధికారులు, సిబ్బంది తదితరుల సహాయంతో పరీక్షలు పకడ్భందీగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించగలిగామన్నారు. గతంలో మాదిరి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా  పరీక్షలు సాఫీగా నిర్వహించగలడం చరిత్ర అన్నారు.
 
ఈ నెల 20 లోపు ఫలితాలను వెల్లడిస్తాం: పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్
క్షేత్రస్థాయి నుండి పై స్థాయి వరకు అధికారులు, సిబ్బంది కష్టపడటం వల్ల, బాధ్యతగా ఉండటం వల్ల పరీక్షను సమర్థవంతంగా నిర్వహించగలిగామని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ పేర్కొన్నారు. నవరత్నాల ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు.

సెప్టెంబర్ 1 నుండి 8 వరకు  రాష్ట్రంలోని 5,314 పరీక్షా కేంద్రాల్లో  గ్రామసచివాలయ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకం కోసం నిర్వహించిన పరీక్షలకు వివిధ కేటగిరీల్లో 21.69 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఆరు రోజుల పాటు పరీక్షలు సమర్థవంతంగా  నిర్వహించామన్నారు.

19.49 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారని పేర్కొన్నారు. అభ్యర్థుల రవాణ సౌకర్యం కోసం 6వేల బస్సులను ఉపయోగించామన్నారు. జవాబు పత్రాలను స్ట్రాంగ్‌రూంలలో భద్రపరిచామని, జిల్లా కేంద్రాలలో ఓఎమ్మార్‌ షీట్ల స్కానింగ్‌ చేపడుతున్నామన్నారు.. ఈ నెల 20 లోపు ఫలితాలను వెల్లడిస్తామని గిరిజా శంకర్‌ పేర్కొన్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా పరీక్షలు నిర్వహించగలిగామన్నారు.

జవాబు పత్రాలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారిచామని, గ్రామ సచివాలయాలకు సంబంధించిన పరీక్షలు రాసిన అభ్యర్థుల ఫలితాలు సెప్టెంబర్ 20వ తేదీలోగా వెల్లడిస్తామని చెప్పారు. ఎలక్షన్ తరహాలో పరీక్షలు పకడ్భంధీగా నిర్వహించామన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి దిశా నిర్దేశాల ప్రకారం రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ సేవలను పారదర్శకంగా, అవినీతి రహితంగా వారి గుమ్మం ముంగిటే అందచేయటానికి గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ, గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థలను తెచ్చారన్నారు.

క్రొత్తగా ఏర్పాటుచేసే 11,158 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు సచివాలయాలు సుమారు 35 రకాల సేవలతో అక్టోబర్ 2 నుండి అమలులోకి తీసుకొని రావటానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు.. అభ్యర్ధుల ఎంపిక  ప్రక్రియ వ్రాత పరీక్షా  ఫలితాల  మెరిట్ ఆధారితంగానే వుంటుందని స్పష్టం చేశారు.

పరీక్షలకు సంబంధించి విడుదల చేసిన “కీ” కు సంబంధించిన అభ్యర్థుల నుండి 52 వేల అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. ఒకే ప్రశ్నకు 2 నుండి 3 వేల అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించిన అధికారులు, సిబ్బందికి, సహకరించిన అభ్యర్థులకు, పరీక్షల విధానంపై అనుక్షణం అభ్యర్థులకు మార్గదర్శకత్వం అందించిన మీడియాకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
 
సచివాలయ ఉద్యోగాల ప్రశ్నాపత్రంలో 25శాతం మాత్రమే కఠినం : గోపాలకృష్ణ ద్వివేది
పరీక్ష ప్రశ్నపత్రాల తయారీలో ఏపీపీఎస్సీ ప్రమాణాలనే పాటించామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణ పారదర్శకంగా జరిగిందని తెలిపారు. ప్రశ్నపత్రాలు కఠినంగా వచ్చిందని పలువురు అభ్యర్థులు చర్చించుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.

పరీక్ష ప్రశ్నపత్రాల తయారీలో ఏపీపీఎస్సీ ప్రమాణాలనే పాటించామని తెలిపారు. కఠినంగా  25 శాతం, తేలికైనవి 25 శాతం, సాధారణ ప్రశ్నలు 50 శాతం ఉండేలా ప్రశ్నాపత్రాలు రూపొందించామని వెల్లడించారు. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత తక్కువ సమయంలో పరీక్షలు నిర్వహించి, లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం జరగలేదన్నారు.

ఇదొక రికార్డన్నారు. పరీక్షలను చాలా పకడ్భంధీగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికను తయారు చేసుకున్నామన్నారు. అందుకనుగుణంగానే కష్టపడి పని చేశామని తెలిపారు. తమకు ఏపీపీఎస్సీ, ఎస్సీఈఆర్టీ, ఏపీపీఎఫ్ఎస్ఎస్, టాటాటెక్ లాంటి పలు సంస్థలు దోహదపడ్డాయని తెలిపారు. అత్యంత వేగంగా ప్రశ్నాపత్రాల స్కానింగ్‌ చేపట్టామని, ఈనెల 20లోపు ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు.

జిల్లాలవారిగా మెరిట్‌ లిస్ట్‌ ప్రకటిస్తామని తెలిపారు. సచివాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, 1500 చోట్ల సచివాలయ భవనాలను నిర్మిస్తామని ద్వివేది పేర్కొన్నారు..పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ ఆలోచనలకు, అభ్యర్థులకు మార్గదర్శకత్వం అందించడంలో మీడియా పాత్ర ప్రశంసనీయమన్నారు. సచివాలయ పరీక్షల నిర్వహణపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తడం సంతోషంగా ఉందన్నారు.

పూర్తి స్థాయి సేవలు అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం: విజయ్ కుమార్
అందరి సహకారం వల్లే సచివాలయ పరీక్షలను ప్రశాంతంగా ముగిశాయని పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ విజయ్ కుమార్ అన్నారు. తమపై నమ్మకంతో ప్రభుత్వం అప్పజెప్పిన పనిని సమర్ధవంతంగా నిర్వహించామన్నారు.

పరీక్షల నిర్వహణ విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. పరీక్షలు సజావుగా సాగేందుకు అధికారులు, సిబ్బంది, మీడియా ఇలా అందరూ సమిష్టిగా కృషి చేయడం వల్ల పరీక్షల నిర్వహణ విజయవంతమైందన్నారు. ప్రజలకు పూర్తి స్థాయి సేవలు అందించాలన్నదే ప్రభుత్వం ఉద్దేశమని ఆయన వెల్లడించారు.

పారదర్శకంగా, స్వేచ్ఛగా పరీక్షలు నిర్వహించాలన్న ముఖ్యమంత్రి సూచనల మేరకే తాము ఇంత విజయవంతంగా నిర్వహించగలిగామన్నారు. ఇప్పటిదాకా యూపీఎస్సీ స్థాయిలోనే 14 లక్షల మంది పరీక్షలు రాసిన రికార్డు ఉండేది. హాజరుశాతం కూడా 50 శాతంగా ఉండేది. కానీ దేశంలోనే తొలిసారిగా 20 లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్షలు రాయడం, 88 శాతంకు పైగా హాజరు అవడం రికార్డు అని అభివర్ణించారు.

ఎలాంటి అవకతవకలు, పొరపాట్లు జరగకుండా పరీక్షలు నిర్వహించడం గొప్ప విజయంగా ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వెన్నంటి ఉండి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలతో పాటు  కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్ధేశం చేశారన్నారు.

ప్రతిరోజూ 3.50 లక్షల పేపర్లను (ఓఎమ్ఆర్) స్కానింగ్ చేస్తూ ఇప్పటికే స్కానింగ్ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించిన అధికారులు, సిబ్బందికి, సహకరించిన అభ్యర్థులకు, పరీక్షల విధానంపై అనుక్షణం అభ్యర్థులకు మార్గదర్శకత్వం అందించిన మీడియాకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

సెప్టెంబర్ 20 నాటికి అభ్యర్థులకు మార్కులతో పాటు ర్యాంకింగ్ ను విడుదల చేస్తామన్నారు. మార్కులు, మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయన్నారు.