1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 15 అక్టోబరు 2023 (12:12 IST)

సీఎం కేసీఆర్ పార్టీ మేనిఫెస్టో.. చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందేనా...?

kcrao
వచ్చే నెలాఖరులో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుంది. ఈ ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి రావాలన్న పట్టులతో అధికార భారత రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ ఉన్నారు. దీంతో ఆయన ప్రతి ఒక్కరి మైండ్ బ్లాక్ అయ్యే మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. నిరుపేద మహిళలకు నెలకు రూ.3 వేలు ఇవ్వనున్నట్టు సమాచారం. రానున్న ఎన్నికల్లోనూ విజయం సాధించాలని, హ్యాట్రిక్ సీఎంగా పేరు సంపాదించాలని ఉవ్విళ్లూరుతున్న కేసీఆర్ మ్యానిఫెస్టోను పకడ్బందీగా తయారుచేసినట్టు సమాచారం.
 
బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు.. ప్రస్తుతం అమల్లో ఉన్న రైతుబీమా పరిహారం రూ.5 లక్షలను రాష్ట్రంలోని 90 లక్షల పేద కుటుంబాలకు వర్తింపజేయనున్నారు. నిరుపేద మహిళలకు జీవనభృతిగా ప్రతినెల రూ.3000 అందిస్తారు. ఇప్పటికే పెన్షన్ అందుతున్న మహిళలను ఇందులోంచి మినహాయిస్తారు. 
 
అలాగే, ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితర వారికి ప్రస్తుతం అందిస్తున్న రూ.2,016 పింఛన్ ను రూ. 3,016కు పెంచుతారు. జర్నలిస్టులకు ప్రత్యేక పెన్షన్ పథకం, రైతుబంధు సాయం రూ.16 వేలకు పెంపు, ప్రతి సీజన్లో ఉచితంగా ఎకరానికి రెండు బస్తాల యూరియా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు ఇస్తున్న ఆర్థికసాయం రూ.1.25 లక్షలకు పెంచనున్నారు. 
 
అలాగే, వంట గ్యాస్ సిలిండర్లపై రూ.400 వరకు సబ్సిడీ, మహిళలకు రూ. 2 లక్షల మేర వడ్డీలేని రుణాలు, ఆరోగ్యశ్రీలో చికిత్స పరిమితి రూ.10 లక్షలకు పెంపు, పెంట్రోలు, డీజిల్ ధరలపై రాష్ట్ర పన్ను వాటా కొంత మేర తగ్గింపు వంటివి ఉన్నాయి. అయితే, ఈ మేనిఫెస్టోను అధికారికంగా ఆదివారం వెల్లడించనుంది.