మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 ఏప్రియల్ 2021 (10:14 IST)

తెలంగాణాలో మూడు వారాల్లో 4 రెట్లు పెరిగిన కరోనా

తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి రేటు శరవేగంగా సాగుతోంది. రోజురోజుకూ సరికొత్త రికార్డులను చేరుతోంది. సోమవారం తెలంగాణ వ్యాప్తంగా మరో 5926 మంది వైరస్‌ బారినపడ్డారు. ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. 
 
ఇక పాజిటివ్‌ రేటు కూడా తొలి వేవ్‌ కంటే చాలా వేగంగా పెరుగుతోంది. వైద్యశాఖ లెక్కల ప్రకారం రోజూ సగటున 800 వరకు కేసులు పెరుగుతున్నాయి. ఈ నెలలో 19 రోజుల్లోనే 51,618 పాజిటివ్‌లు రాగా.. 150 మంది చనిపోయారు. 
 
ఏప్రిల్‌ 1న వ్యాప్తి రేటు 1.6 ఉండగా తాజాగా అది 4.85కు చేరింది. అంటే మూడు వారాల్లో నాలుగు రెట్లు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 1,22,143 టెస్టులు చేయగా 5926 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,61,359కి పెరిగింది. మరో 18 మంది మరణించారు. 
 
వైద్య శాఖ లెక్కల ప్రకారం ఒక్క రోజులో సంభవించిన అత్యధిక మరణాలు ఇవే. ఇక యాక్టివ్‌ కేసుల సంఖ్య 42,853కు పెరిగింది. మరో 2209మంది కోలుకున్నారు. 25 జిల్లాల్లో వందల సంఖ్యలో పాజిటివ్‌లు నమోదయ్యాయి. గ్రేటర్‌లో 793, మేడ్చల్‌లో 488, రంగారెడ్డిలో 455, నిజామాబాద్‌లో 444 పాజిటివ్‌లు వచ్చాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 3703, ప్రైవేటులో 10919 మంది కొవిడ్‌ రోగులు చికిత్స పొందుతున్నారు. 
 
ఇకపోతే, రాష్ట్రవ్యాప్తంగా మరో 1,55,869 మంది తొలి డోసు టీకా తీసుకున్నారు. దీంతో వీరి సంఖ్య 27,47,831కు చేరింది. 21,352 మంది రెండో డోసు తీసుకోవడంతో ఆ సంఖ్య 3,81,664కు పెరిగింది. కేంద్రం మంగళవారం 7.50 లక్షల డోసులను పంపింది.