గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 మార్చి 2023 (15:10 IST)

సొంతగూటికి చేరిన ధర్మపురి శ్రీనివాస్... మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు..

dharmapuri srinivas
ధర్మపురి శ్రీనివాస్.. ఒకపుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పేరు తెలియని వారు ఉండరు. పీసీసీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పని చేశారు. ముఖ్యంగా, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఆయన ఉమ్మడి ఏపీతో పాటు కాంగ్రెస్ పార్టీని శాసించారు. డీఎస్‌ గతంలో కాంగ్రెస్‌లో కీలక పదవులు నిర్వర్తించారు. ఉమ్మడి ఏపీలో పార్టీ 2004, 2009లో అధికారంలో ఉన్నప్పుడు డీఎస్‌ మంత్రిగా సేవలందించారు.
 
రాష్ట్ర విభజన తర్వాత 2015లో భారాసలో చేరిన డీఎస్‌.. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే, గత కొన్ని రోజులుగా ఆ పార్టీలో ఆయనకు సరైన ఆదరణ దక్కలేదు. దీంతో బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. ఈ క్రమంలో ఆయన బీఆర్ఎస్‌లో చేరారు. ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావ్‌ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో డీఎస్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. 
 
డీఎస్‌తో పాటు ఆయన తనయుడు, నిజామాబాద్‌ మాజీ మేయర్‌ సంజయ్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. మాజీ మంత్రులు జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ వీహెచ్‌ తదితరులు పాల్గొన్నారు.