శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 15 ఏప్రియల్ 2021 (14:20 IST)

తాగితే ఒక ధర.. తూగితే ఒక ధర : బెంగుళూరులో మత్తు పార్టీల బాగోతం!

గ్లాసుల గలగలలు.. విదేశీ యువతుల నృత్యాలు.. ఏది కావాలంటే అది క్షణాల్లో సమకూర్చే వెసులుబాటు.. ఇవీ బెంగళూరులోని ‘మత్తు’ పార్టీల్లో ప్రత్యేక ఆకర్షణ! అత్యంత విలాసవంతంగా సాగే ఈ పార్టీల కోసం తెలంగాణ నుంచి కొందరు ప్రముఖులు పరుగులు పెట్టేవారు. వారాంతాల్లో సేదతీరేవారు. అనూహ్యంగా ఇప్పుడు మత్తుమందుల గుట్టు బయటపడటంతో ఆ పార్టీల వ్యవహారం వెలుగులోకి వస్తోంది. గంటల వ్యవధిలో రూ.లక్షలు ఆవిరయ్యే విలాసవంతమైన ఆ పార్టీల గురించి తెలిసి బెంగళూరు పోలీసులే విస్తుపోతున్నారు. వారి దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. 
 
బెంగళూరులోని డాలర్స్‌ కాలనీతోపాటు ఓ ప్రముఖ హోటల్లో వారాంతాల్లో పార్టీలు జరిగేవి. అతిథులు కోరిన ‘సకల సదుపాయాలు’ కల్పించేవారు. పార్టీకి హాజరయ్యేందుకు ప్రవేశ రుసుం రూ.3,500 మాత్రమే. ఒకసారి లోపలికి అడుగుపెట్టాక అక్కడ అందించే ప్రతి సేవకు ఒక్కో ధర చెల్లించాలి. తాగే మద్యానికి, తినే తిండికి వేర్వేరుగా వసూలు చేసేవారు. వాటితోపాటు మత్తు మందులు కావాల్సిన వారికి వాటిని ఏర్పాటు చేస్తారు. ఈ మత్తుమందులు కూడా రకానికి ఓ ధర చొప్పున ఉండేవి. 
 
బెంగళూరుతోపాటు హైదరాబాద్‌ వంటి ఇతర ప్రాంతాల నుంచి హాజరయ్యే అతిథులు ప్రధానంగా మత్తుమందులు, విదేశీ యువతుల కోసమే వచ్చేవారని తేలింది. శుక్రవారం అర్థరాత్రి మొదలయ్యే ఈ పార్టీలు ఆదివారం ఉదయం వరకూ జరిగేవి. తొలుత ప్రవేశరుసుం చెల్లించి లోనికి వెళ్లాక అక్కడ పొందే సేవల్లో కొన్నింటికి రూ.లక్ష వరకూ ధరలు ఉండేవని, ముఖ్యంగా విదేశీ యువతుల కోసం ఎక్కువ మొత్తం చెల్లించేవారని గుర్తించారు. మద్యం తాగుతూ, మత్తుమందులు తీసుకుంటూ, విదేశీ యువతులతో నృత్యంచేస్తూ బయటకు రాకుండా దాదాపు రెండురోజులు అక్కడే గడిపేవారని, ఇందుకుగాను కొందరైతే రూ.3 నుంచి రూ.4 లక్షలు కూడా ఖర్చు చేసేవారని తెలుస్తోంది.
 
అవును నన్ను విచారించారు: కలహర్‌ రెడ్డి 
బెంగళూరు పోలీసులు ఇటీవల తనను విచారించిన మాట వాస్తవమేనని మత్తుమందు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌ నగరానికి చెందిన వ్యాపారి కలహర్‌రెడ్డి తెలిపాడు. మూడేళ్ల కిందట అక్కడ జరిగిన ఓ వేడుకకు సంబంధించిన వివరాలపై తనను పిలిచి ప్రశ్నించారని చెప్పాడు. 
 
మంగళవారం అతను ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడాడు. కన్నడ సినీ నిర్మాత శంకర్‌గౌడ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన వేడుక వివరాలు, ఆయనతో తనకు గల సంబంధం గురించి అడిగితే చెప్పానని, ఆ వివరాలు వారు నమోదు చేసుకున్నారన్నాడు. అప్పుడు ఎవరెవరు వచ్చారు, అక్కడ మీరు మత్తు మందు తీసుకున్నారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని, ఆ విషయాల్లో తనను ఇరికించొద్దని పేర్కొంటూ నిమిషాల్లో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
 
హైదరాబాద్‌లోనూ.. 
అప్పుడప్పుడూ హైదరాబాద్‌లోనూ ఇలాంటి పార్టీలు జరిగేవని బెంగళూరు పోలీసులు అనుమానిస్తున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు మత్తుమందులు సరఫరా జరిగేదని నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఇక్కడ జరిగే పార్టీల్లో వాటిని వినియోగించేవారని భావిస్తున్నారు. వీటిని సరఫరా చేసిన వారిని ప్రశ్నించడం ద్వారా ఎక్కడెక్కడ పార్టీలు జరిగేవి, వాటిలో ఎవరెవరు పాల్గొనేవారన్న విషయాన్ని తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు.
 
సరఫరాదారు డానియేల్‌...
ఈ పార్టీల కోసం బెంగళూరుకు చెందిన డానియేల్‌ అనే వ్యక్తి ప్రత్యేకంగా యువతులను ఇరాన్‌ నుంచి రప్పించేవాడని తేలింది. అప్పుడప్పుడూ రష్యన్‌ యువతులు కూడా వీటికి హాజరయ్యేవారని, ఇరానీ యువతులకే డిమాండు ఎక్కువ ఉండేదని వెల్లడైంది. బెంగళూరులో జరిగే ఈ పార్టీలకు డానియేల్‌ ఎక్కువగా ఇరానీ యువతులనే రప్పించేవాడని తేలడంతో బెంగళూరు పోలీసులు వారి పాస్‌పోర్టు వివరాలు సేకరిస్తున్నారు. ఎలాంటి వీసా మీద ఇక్కడకు వచ్చారన్న సమాచారంతోపాటు ఒకవేళ వారు ఇక్కడే ఉండి ఉంటే ఈ కేసులో సాక్షులుగా వారి వాంగ్మూలం నమోదు చేయాలని భావిస్తున్నారు.